ఆలయాల్లో చోరీలపై సా..గుతున్న విచారణ!
ABN , First Publish Date - 2022-05-27T06:36:14+05:30 IST
పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన చోరీ కేసుల విచారణ ముందుకు సాగుతున్నట్టు లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఆలయాల్లో హుండీలను లక్ష్యంగా చేసుకొని ఏప్రిల్, మే నెలల్లో దుండగులు ఒకే తరహా చోరీలకు పాల్పడడం గమనార్హం.
కానరాని పురోగతిపై పలువురు పెదవి విరుపు
కేసుల నమోదుకే పరిమితం అవుతున్న పోలీసులు
వరుస ఘటనలపై కానరాని చర్యలు
ఏప్రిల్, మే నెలల్లోనే మూడు ఆలయాల్లో చొరబడిన దొంగలు
నర్సీపట్నం, మే 26 : పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన చోరీ కేసుల విచారణ ముందుకు సాగుతున్నట్టు లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఆలయాల్లో హుండీలను లక్ష్యంగా చేసుకొని ఏప్రిల్, మే నెలల్లో దుండగులు ఒకే తరహా చోరీలకు పాల్పడడం గమనార్హం. ప్రహరీ గోడ దూకి ఆలయం లోపలకు చొరబడి హుండీలు బయటకు తీసుకొచ్చి, తాళాలను పగుల గొడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని దొంగతనాలు ఇదే తరహాలో ఉంటున్నాయి. ఆల యాల నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసులు నమోదుతో సరిపెడుతున్నారు తప్పితే, కేసుల పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో హుండీలను పగులగొట్టి నగదును దోచుకు వెళ్లారు. ఆ తర్వాత వరుసగా ఇదే ఆలయంలో మూడు పర్యాయాలు చోరీలు జరిగాయి. ఈ సంవత్సరం శివరాత్రి ముందు రోజు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని హుండీలను ఎన్టీఆర్ మినీ స్టేడియంలోకి తీసుకొచ్చి తాళాలను పగులగొట్టి నగదు పట్టుకు పోయారు. అలాగే, ఏప్రిల్ 8న మరోసారి ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని సొమ్ము దోచుకు వెళ్లారు. అదేరోజు స్వామి అయ్యప్ప గుడిలోని హుండీలను స్టేడియం ఆవరణలోకి తీసుకొచ్చి తాళాలు పగులగొట్టి భక్తులు వేసిన కానుకలు అపహరించారు. అదే విధంగా ఇటీవల వేంకటేశ్వరస్వామి గుడిలో హుండీల తాళాలు పగుల గొట్టి సొమ్ము అపహరించేందుకు ప్రయత్నం చేశారు. వాచ్మేన్ కేకలు వేయడంతో దుండగులు గోడ దూకి పరారయ్యాయి. ఈ ఆలయంలో శుక్రవారం హుండీలను లెక్కిస్తారనగా గురువారం అర్ధరాత్రి చోరీ యత్నం జరగడం గమనార్హం. పట్నంలోని ప్రధాన కూడళ్లలోని ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగి పోతున్నారు. స్వామిఅయ్యప్ప, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలు అబీద్ సెంటర్లో ఉన్నాయి. ఇక్కడ అర్ధరాత్రి వరకు పోలీసులు పహరా కాస్తుంటారు. అబీద్ సెంటర్ నాలుగు వైపులా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఇలా ఒకే తరహా దొంగతనాలు జరుగుతున్నా పోలీసు కేసుల్లో పురోగతి కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. దొంగతనాలు జరిగినప్పడు క్లూస్ టీమ్ వచ్చి వేలి ముద్రలు సేకరిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దొంగలను పట్టుకున్న సందర్భాలు కనిపించలేదని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై పట్టణ ఇన్చార్జి సీఐ మోహన్రావు మాట్లాడుతూ ఈ తరహా చోరీలు చేసిన పాత నేరస్థులను విచారణ చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.