‘పెద్దేరు’లో వృద్ధుడి గల్లంతు
ABN , First Publish Date - 2022-05-21T06:46:52+05:30 IST
పెద్దేరు నదిలో ఓ వృద్ధుడు గల్లంతైన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వ్యవసాయ పనులకు నదిని దాటుకుని వెళ్లిన తండ్రీకొడుకు
మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా అధికమైన నీటి ప్రవాహం
సురక్షితంగా ఒడ్డుకు చేరిన కొడుకు, కొట్టుకుపోయిన తండ్రి
బెన్నవోలు గ్రామ సమీపంలో ఘటన
చోడవరం, మే 20: పెద్దేరు నదిలో ఓ వృద్ధుడు గల్లంతైన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలివి. బెన్నవోలుకు చెందిన మజ్జి అచ్చంనాయుడు (60), అతని కుమారుడు ప్రసాద్ శుక్రవారం ఉదయం నది అవతల ఉన్న తమ పొలానికి పనుల నిమిత్తం కలిసి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేందుకు నదిని దాటుతుండగా, అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో తండ్రీకొడుకు కొంతదూరం కొట్టుకుపోయారు. అయితే ప్రసాద్ అతికష్టమ్మీద ప్రవాహాన్ని దాటుకుని ఒడ్డుకు చేరుకోగా, తండ్రి మాత్రం గల్లంతయ్యాడు. ఈ సమాచారం అందుకున్న చోడవరం ఎస్ఐ విభీషణరావు, తహసీల్దార్ తిరుమలబాబు, సర్పంచ్ మూడెడ్ల శంకరరావులు నది వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టినా సాయంత్రం వరకు అచ్చంనాయుడు ఆచూకీ కానరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.