న్యాయ వ్యవస్థలో మహిళా జడ్జీల సంఖ్య పెరగాలి
ABN , First Publish Date - 2022-08-12T06:16:56+05:30 IST
న్యాయస్థానాల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరగాలని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ నందా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరగాలని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ నందా అభిప్రాయ పడ్డారు. రాబోయే రోజుల్లో భారత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులుగా మహిళలకు 50శాతం ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం సందర్భం గా గురువారం ‘విమెన్ ఇన్ నేషన్ బిల్డింగ్, ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ సింపోజియంలో సదస్సులు, చర్చగోష్టిలు జరిగాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన జస్టిస్ నందా న్యాయ వ్యవస్థలో మహిళ న్యాయమూర్తుల అవశ్యకత గురించి మాట్లాడారు. ఎఫ్డబ్ల్యూఓ చైౖర్ పర్సన్ గీతాంజలి మన్రల్ భారత సైన్యం అత్యున్నత సేవలు, యుద్ధ-వితంతువులు ఎదుర్కొనే సవాళ్ల గురించి వివరించగా, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి స్వాతంత్ర్యానికి ముందు మహిళల స్థితిగతులు, 75ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మహిళల పరిస్థితులని వివరించారు. గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం డాక్టర్ సరళ 75ఏళ్ల స్వాతంత్య్రంలో ప్రభుత్వ విధానం - మహిళా సాధికారత అనే అంశంపై మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కే.సీతారామరావు, రిజిస్ర్టా ర్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఇ.సుధారాణి, జూపాక సుభద్ర, వర్సిటీలోని డైరెక్టర్లు, డీన్లు, పలు శాఖల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.