వచ్చే దశాబ్దం మనదే: Koo App సీఈవో అప్రమేయ రాధాకృష్ణ
ABN , First Publish Date - 2022-07-10T00:37:06+05:30 IST
ప్రస్తుత వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే దశాబ్దం మనదేనని కూ (Koo) యాప్ సీఈవో,
న్యూఢిల్లీ: ప్రస్తుత వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే దశాబ్దం మనదేనని కూ (Koo) యాప్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశపు మొట్టమొదటి బహుభాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయిన కూ యాప్ ప్రారంభం నుంచి వినూత్న ఫీచర్లతో సోషల్ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోంది.
నైజీరియాలోనూ దీని వినియోగం మొదలైంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దీనిని ఉపయోగించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంగ్లిష్ మాట్లాడని ప్రతి వ్యక్తికి భావప్రకటనా స్వేచ్చ కల్పించాలన్న ఉద్దేశంతో రూపుదిద్దుకున్న ఈ స్టార్టప్ ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతోంది.
గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఇటీవల నిర్వహించిన డిజిటల్ ఇండియా వీక్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు టెక్ స్టార్టప్లు పాల్గొని ప్రధాని మోదీ కలలుగన్న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా తమ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా 'క్యాటలైజింగ్ న్యూ ఇండియా టేక్డ్' అంశంపై ఆసక్తికరమైన సెషన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని కొత్త స్టార్టప్లతో పాటు కూ యాప్ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. టెక్నాలజీ ద్వారా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికతో పాటు ఈ దేశీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ శక్తిని పరిచయం చేశారు. అనంతరం ఆయన ‘కూ’ చేస్తూ.. గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వీక్లో పాల్గొన్నట్టు పేర్కొంటూ ‘వచ్చే దశాబ్దం మనది’ అని పేర్కొన్నారు.