సీఎం నుంచే ‘తరలింపు’ ఫైల్!
ABN , First Publish Date - 2020-02-19T10:46:47+05:30 IST
సీఎం నుంచే ‘తరలింపు’ ఫైల్!సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించింది. జీఏడీ ముఖ్యకార్యదర్శి నుంచి తరలింపు ప్రతిపాదనలకు సంబంధించిన నోట్ఫైల్ ఏదని
జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రతిపాదనల నోట్ఫైల్ ఏదీ?
కార్యాలయాల తరలింపుపై త్రిసభ్య ధర్మాసనం ప్రశ్న
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సీఎం నుంచే ‘తరలింపు’ ఫైల్!సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించింది. జీఏడీ ముఖ్యకార్యదర్శి నుంచి తరలింపు ప్రతిపాదనలకు సంబంధించిన నోట్ఫైల్ ఏదని అడిగింది. తరలింపు వ్యవహారంలో కేంద్రప్రభుత్వం కీలకం.. కానీ మౌనంగా ఉంటోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. సచివాలయంలో తగిన స్థలం లేకపోతే సమీపంలోని మరో ప్రాంతానికి వెళ్లాలి కానీ వేరే జిల్లాకు కార్యాలయాలు తరలించడమెందుకని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జారీ చేసిన జీవోతో పాటు విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్-బి నిర్మాణ పనుల కోసం రూ.19.73కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎం.రమేష్, రాజధాని అభివృద్ధి పనుల సమీక్షను అడ్డుకోవాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేలకు రామారావు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పాటిబండ్ల సుధాకర్, రాజధానిలో అభివృద్ధి పనులు కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి గద్దె తిరుపతిరావు తదితరులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై మంగళవారం మరోమారు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. కర్నూలుకు కార్యాలయాల తరలింపు ప్రభుత్వ విధానమైన నిర్ణయమని పేర్కొన్నారు. రాజధాని తరలింపులో భాగంగా వీటిని కర్నూలు తరలించడం లేదని, సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. విజిలెన్స్ కమిషన్ తరలింపు కోసం గతేడాది జూలైలోనే నోట్ఫైల్స్ వచ్చాయని, అప్పటినుంచే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు రాజధానికి దూరంగానే ఉన్నాయన్నారు. జీఏడీలో విజిలెన్స్ కమిషన్ భాగం కాదని, అదొక స్వతంత్ర సంస్థ అని పేర్కొన్నారు. స్థలం సరిపోకపోవడం వల్లనే ఆ కార్యాలయాలను తరలిస్తున్నామన్నారు. కార్యాలయాల తరలింపు వ్యవహారంలో నోట్ఫైల్ గురించి ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ముఖ్యమంత్రి కూడా ఫైల్ను ముందుకు పంపవచ్చని వివరించారు. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం గుర్తించిన ప్రభుత్వ కార్యాయాలను వేరే ప్రాంతానికి తరలించడానికి వీల్లేదని, ఆ రెండు కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలని, ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అంబటి సుధాకర్రరావు, కారుమంచి ఇంద్రనీల్బాబు, వీవీ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ అభ్యర్థించారు.
ప్రభుత్వంపై విశ్వాసంతో రైతులు రాజధానికి భూములిచ్చారని, కానీ ప్రభుత్వ చర్యలతో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. స్థలాభావంతో కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తున్నట్లు నోట్ఫైల్స్లో ప్రస్తావించలేదన్నారు. కార్యాలయాల తరలింపు ప్రయత్నాలు గతేడాదే ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెప్పడం సరి కాదన్నారు. విజిలెన్స్ కమిషన్లో కొద్దిమంది మాత్రమే పని చేస్తున్నారని, సచివాలయంలోని కార్యాలయం వారికి సరిపోతుందన్నారు. ఆయా శాఖలు, విజిలెన్స్ కమిషన్కు మధ్య విజిలెన్స్ అధికారులు సమన్వయకర్తలుగా ఉంటారని, ఇప్పుడు కర్నూలుకు కార్యాలయం తరలించడం వల్ల ఈ సమన్వయం దెబ్బతింటుందని కోర్టు దృష్టికి తెచ్చారు.