గుట్టలు చదును చేసేస్తున్నారు!
ABN , First Publish Date - 2022-06-14T07:11:31+05:30 IST
పలమనేరు గంటావూరు ఇందిరమ్మ కాలనీలో గుట్టల చదును రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఓ వైపు నిబంధనలు పట్టించుకోకుండా రేయింబవళ్లు పనులు సాగుతున్నాయి. సోమవారం గుట్టల చదునులో అక్రమాలపై టీడీపీ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేవలం 85 మందికి కావలసిన నివేశ స్థలాల కోసం 400 మందికి సరిపడా స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారంటూ ప్రశ్న తలెత్తుతోంది.
పలమనేరులో వివాదం
85 మందికి ఇళ్ల స్థలాలైతే 400 మందికి సరిపడా సిద్ధం చేయడం ఎందుకో?
పలమనేరు గంటావూరు ఇందిరమ్మ కాలనీలో గుట్టల చదును రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఓ వైపు నిబంధనలు పట్టించుకోకుండా రేయింబవళ్లు పనులు సాగుతున్నాయి. సోమవారం గుట్టల చదునులో అక్రమాలపై టీడీపీ నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేవలం 85 మందికి కావలసిన నివేశ స్థలాల కోసం 400 మందికి సరిపడా స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారంటూ ప్రశ్న తలెత్తుతోంది. గంటావూరు ఇందిరమ్మ కాలనీలో అక్రమ పట్టాలు సృష్టించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే.. మళ్లీ ఈ కాలనీలో గుట్టల చదునుచేసే పనులను టెండర్లు లేకనే అప్పగించారు. ఈ క్రమంలో ఎక్కువ స్థలం చదును చేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం గుట్టల చదును కోసం రెవెన్యూ అధికారులు అనుమతిస్తే సదరు వ్యక్తి అడ్డుగా వచ్చిన బండరాళ్లను రాత్రికిరాత్రే నిషేధిత నల్లమందు, డిటోనేటర్ల సాయంతో పేల్చివేస్తున్నాడు. దీనిపై పోలీసులు గానీ మైనింగ్ అధికారులు గానీ నోరు మెదపడం లేదు. దీనికి కారణం వారు కాంట్రాక్టు తీసుకొన్న వ్యక్తితో ఉన్న ‘అవగాహన’ కారణమన్న ఆరోపణలున్నాయి.
అటవీ బఫర్ జోన్లోనూ..
గంటావూరు ఇందిరమ్మ కాలనీకి సమీపంలోని అటవీ సరిహద్దులు కూడా గుట్టల చదునులో భాగంగా నేలమట్టం అవుతున్నాయి. వాస్తవానికి అటవీ సరిహద్దునుంచి కనీసం 40 మీటర్ల మేర బఫర్ జోన్గా పిలుస్తారు. ఇందులో ప్రవేశిస్తే నేరం కింద పరిగణించాలి. అయితే అటవీ శాఖ ఏనుగులు దాడులను నియంత్రించేందుకు తవ్విన కందకాల మట్టిని పోసిన ప్రాంతంలో కూడా చదును చేస్తున్నారు. బఫర్ జోన్లోని చిన్న చెట్లనూ తొలగించి నివేశస్థలాలుగా మార్చేందుకు అటవీ భూమిని చదును చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఈ బఫర్ జోన్లో పునాదులు కూడా వేసేశారు. మరి వీరందరికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారా లేదా గంటావూరు కాలనీలో అక్రమ పట్టాలు ఇచ్చారో తెలియడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండానే డిటోనేటర్లు వినియోగించి వైసీపీ నాయకుడు గుట్టల చదును చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం తమకేమి పట్టనట్టు వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలున్నాయి.
-పలమనేరు