చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
ABN , First Publish Date - 2022-05-22T06:02:32+05:30 IST
కుటుంబంలో ఆస్తులు, అప్పుల పంపకంలో తేడాల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 9న ఆత్మహత్యాయత్నం చేసిన భువనగిరిలోని శ్రీకార్తికేయ టైల్స్, శానిటరీ దుకాణ యజమాని బల్లి దయాకర్ (44) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
భార్య ఫిర్యాదుతో కుటుంబ సభ్యులపై కేసు నమోదు
భువనగిరి టౌన్, మే 21: కుటుంబంలో ఆస్తులు, అప్పుల పంపకంలో తేడాల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 9న ఆత్మహత్యాయత్నం చేసిన భువనగిరిలోని శ్రీకార్తికేయ టైల్స్, శానిటరీ దుకాణ యజమాని బల్లి దయాకర్ (44) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దయాకర్ భార్య శాంతిప్రియ ఫిర్యాదు మేరకు కుటుంబసభ్యులపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరిలో శ్రీకార్తికేయ ఏజెన్సీ పేరుతో టైల్స్, శానిటరీ వ్యాపారాన్ని దయాకర్ తన సోదరుడితో కలిసి నిర్వహించేవారు. అయితే నాలుగేళ్ల క్రితం సోదరుడు మృతి చెందడంతో మరో సోదరుడితో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఆస్తుల పంపకం విషయంలో తేడాలు రావడంతో స్థానిక పెద్ద మనుషులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు తనకు అన్యాయం చేశారని, సమన్యాయం పాటించాల్సిన పెద్ద మనుషులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ నెల 9న వాట్సప్ వీడియోను పోస్ట్చేసి దయాకర్ పురుగులమందు తాగాడు. వెంటనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. తన భర్త ఆత్మహత్యకు అతని తల్లి బల్లి చంద్రకళ, తమ్ముడు బల్లి సతీష్, అతని కుమారుడు బల్లి ఓంకార్, తోటి కోడళ్లు బల్లి విజయలక్ష్మీ, బల్లి రాధిక, మేనమామ పడకంటి శంకర్, పంచాయితీ పెద్ద సముద్రాల ఆంజనేయులే కారణం అంటూ మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
మాడ్గులపల్లి, మే 21: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. వేములపల్లి మండలం పచ్చారిగడ్డకు చెందిన మేతనూరి శ్రవణ్కుమార్(22) ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా, చికిత్స పొందుతూ శనివారం మృత్యువాతపడ్డాడు.