మార్కెట్ 3-4 నెలలు ఇలానే..
ABN , First Publish Date - 2022-05-21T08:38:55+05:30 IST
స్వల్పకాలానికి ముఖ్యంగా వచ్చే 3-4 నెలలు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతునే ఉంటాయని ఎడెల్వైజ్ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వె్స్టమెంట్ ఆఫీసర్ (సీఐఓ) త్రిదీప్ భట్టాచార్య తెలిపారు
అయినా కొద్దికొద్దిగా మదుపు చేయండి.. ఎడెల్వైజ్ అసెట్ మేనేజ్మెంట్ సీఐఓ భట్టాచార్య
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్వల్పకాలానికి ముఖ్యంగా వచ్చే 3-4 నెలలు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతునే ఉంటాయని ఎడెల్వైజ్ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వె్స్టమెంట్ ఆఫీసర్ (సీఐఓ) త్రిదీప్ భట్టాచార్య తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగ పెట్టుబడులు ఆకర్షణీయంగా పెరుగుతున్నాయి. గత పదేళ్లలో ప్రభుత్వ రంగ పెట్టుబడుల కన్నా ప్రైవేటు పెట్టుబడులు 5-6 రెట్లు అధికంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెంటరీలు కనిష్ఠ స్థాయికి తగ్గాయి. ఇక ఈ రంగం మరింత పుంజుకుంటుంది. 15 ఏళ్ల తర్వాత మొదటిసారి వేతనాల్లో రెండంకెల వృద్ధి రేటు కనిపిస్తోంది. ఇటువంటి సానుకూల అంశాలను విశ్లేషిస్తే వచ్చే రెండేళ్లకు మార్కెట్కు ఢోకా లేదని త్రిదీప్ తెలిపారు. స్వల్పకాలానికి వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, చమురు ధరలు, భౌగోళిక, రాజకీయ అంశాల ప్రభావం ఉంటుంది. 2022 సెప్టెంబరు వరకూ మార్కెట్లో ఊగిసలాట ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా స్థిరపడవచ్చని అన్నారు. మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని మార్కెట్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టకుండా.. కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టడం మంచిది. మార్కెట్కు దూరంగా ఉండడం సరైన వ్యూహం కాదని చెప్పారు. ఐదేళ్లకు మించి వేచి చూసే వారు మధ్య స్థాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్లను పెంచుకుంటే బాగుంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు పెద్ద కంపెనీల్లో మదుపు చేసే ఫండ్లను ఎంచుకోవచ్చన్నారు. కన్స్యూమర్, యుటిలిటీస్ రంగాలకు చెందిన కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించారు.