ఫలించిన సుదీర్ఘ నిరీక్షణ

ABN , First Publish Date - 2021-05-08T06:57:33+05:30 IST

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది

ఫలించిన సుదీర్ఘ నిరీక్షణ

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ ఆమోదముద్ర


తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.ఇళ్ళ స్థలాలు కేటాయించాలని ఏళ్ళ తరబడీ ఉద్యోగ సంఘాలు టీటీడీని కోరుతున్న నేపధ్యంలో ప్రస్తుత పాలకవర్గం 2019 డిసెంబరు 28న జరిగిన బోర్డు సమావేశంలో చర్చించింది. అర్హులైన ఉద్యోగులకు స్థలాలు కేటాయించేందుకు సానుకూలంగా తీర్మానం (నెంబరు 264) ఆమోదిస్తూ అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించింది. ఆ మేరకు టీటీడీ ఈవో ప్రభుత్వ ఆనుమతి కోరుతూ ప్రతిపాదనలు  పంపించారు. మరోవైపు తిరుపతి పరిసరాల్లో 250 నుంచీ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కలెక్టర్‌కు కూడా లేఖ రాశారు. ఈవో ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగులకు స్థలాల కేటాయింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తిరుపతి పరిసరాల్లో అనువైన భూమిని గుర్తించే దిశగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించింది.


గతంలో నగరి ఎమ్మెల్యే అభ్యంతరాలతో ఆగిన ఫైలు


టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు ఫైలు  గతేడాది చాలా వేగంగా కదిలింది. టీటీడీ ఛైర్మన్‌ చొరవతో అప్పటి కలెక్టర్‌ గుట్టుగా చర్యలు చేపట్టారు.వడమాలపేట మండల పరిధిలో అనువైన భూములు కూడా గుర్తించారు.అయితే నగరి ఎమ్మెల్యే రోజా అభ్యంతరాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అలాగని టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల కేటాయింపునకు ఆమె అభ్యంతర పెట్టలేదు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా  భూముల కేటాయింపు జరిపేందుకు ప్రయత్నించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ కలెక్టర్‌ గుర్తించిన భూములు రోజా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ హోదాలో వడమాలపేట మండలంలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ఎంపిక చేసిన భూములు కావడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉద్దేశించిన భూములను తన ప్రమేయం లేకుండా ఇతర అవసరాలకు కేటాయించే ప్రయత్నం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన రోజా ఏకంగా అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇది వివాదంగా మారడంతో పాటు సీఎం జగన్‌ దృష్టికి వెళ్ళడంతో తర్వాత జిల్లా యంత్రాంగం గానీ, టీటీడీ పెద్దలు గానీ వడమాలపేట మండలం భూముల జోలికి పోలేదు. ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది. అయితే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల ప్రతిపాదనలు కూడా అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడంతో మరోసారి అటు టీటీడీ, ఇటు జిల్లా అధికారులు అనువైన భూముల అన్వేషణలో పడనున్నారు. కాగా ప్రభుత్వ తాజా ఉత్తర్వుల పట్ల టీటీడీ ఉద్యోగవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-05-08T06:57:33+05:30 IST