చివరిరోజులు కాశీలోనే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

ABN , First Publish Date - 2021-12-14T18:36:32+05:30 IST

జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని వారణాసి పర్యటనను ఉద్దేశించి..

చివరిరోజులు కాశీలోనే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని వారణాసి పర్యటనను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అఖిలేష్ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని చాటుతున్నాయని కౌంటర్ ఇచ్చింది.


వారణాసిలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని సోమవారంనాడు రావడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ''మంచిదే. వాళ్లు (ప్రధాని, బీజేపీ నేతలు) నెల రోజులే కాదు, రెండు మూడు నెలలు కూడా ఉండొచ్చు. జనం తమ చివరి రోజులు గడిపేందుకు ఇక్కడకు (కాశీ) వస్తుంటారు" అని వ్యాఖ్యానించారు.బీజేపీ ప్రతి ఒక్కరితోనూ అబద్ధాలు చెబుతోందని, కానీ భగవంతుడి ముందు అబద్ధాలు చెప్పడం సరికాదని అఖిలేశ్ హితవు పలికారు. కాగా, అఖిలేష్ చేసిని 'చివరిరోజులు' వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు ఢిల్లీలో స్పందించారు. అఖిలేష్ యాదవ్ వాడిన భాష ఆయన మానసిక స్థితిని చెబుతున్నాయని, సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ఆందోళనకు ఆయన మాటలు అద్దం పడుతున్నాయని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోట వినాల్సి రావడం దురదృష్టకరమని, అలా మాట్లాడతారని ఊహించలేదని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-14T18:36:32+05:30 IST