కొడంగల్-తాండూరు రోడ్డు బాగుచేయాలి
ABN , First Publish Date - 2021-07-30T05:16:24+05:30 IST
కొడంగల్-తాండూరు రోడ్డు బాగుచేయాలి
- యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర
కొడంగల్: కొడంగల్-తాండూరు రోడ్డును బాగు చేయాలని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా కొనసాగింది. కాంగ్రెస్ నాయకులను అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అప్పయ్య, ఎస్సై సామ్యానాయక్ ఆందోళనకారులను సముదాయించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం తాండూరు వెళ్లేందుకు 30 మందికి అనుమతి ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యాకర్తలు తాండూరుకు వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. పాదయాత్రకు బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ అభివృద్ధికి చేసిందేమి లేదని ఆరోపించారు. ధ్వంసమైన కొడంగల్-తాండూరు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.యూసుఫ్,నందారం ప్రశాంత్, కృష్ణంరాజు, ఎండీ.ముస్తాక్, నయీం, శంకర్నాయక్, రాజేశ్రెడ్డి, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.