నిరుద్యోగుల చెవిలో కొలువుల పూలు!

ABN , First Publish Date - 2021-06-19T08:29:16+05:30 IST

‘జాబ్‌ క్యాలెండర్‌ విడుదల’ అంటూ శుక్రవారం జగన్‌ సర్కారు భారీ ఖర్చుతో పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఫొటో... వైసీపీ రంగుల పతాక రెపరెపలతో...

నిరుద్యోగుల చెవిలో కొలువుల పూలు!

‘ఉద్యోగాల విప్లవం’ అంటూ పచ్చి అబద్ధాలు

రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు

అందులో 2.59 లక్షలు వలంటీరు పోస్టులే

అది ‘సేవ’ అని స్వయంగా చెప్పిన సీఎం

పీటీడీలోకి మారిన ఆర్టీసీ సిబ్బందీ తమ ఖాతాలోకే

ఔట్‌ సోర్సింగ్‌లో మారింది పద్ధతే... కొత్త పోస్టులు కావు

కరోనాలో 6 నెలల కోసం ఇచ్చినవీ కొలువులేనట

పాత నోటిఫికేషన్లకు ఆర్డర్లు ఇచ్చి ‘కొత్త కలరింగ్‌’

10,143 ఉద్యోగాల భర్తీకి ఓకే 

ఆదేశాలు జారీచేసిన ఆర్థిక శాఖ


‘ఉద్యోగాల విప్లవం’ అంటూ ఉత్తుత్తి లెక్కలు చెప్పారు. జనం సొమ్ముతో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. కేవలం రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ఒకేసారి ఆంధ్రులందరి చెవిలో పూలు పెట్టారు! ‘దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా’... అక్షరాలా అసత్యాలు, అర్ధసత్యాలను వండి వార్చారు.


రెండేళ్లలో ఇచ్చాం అంటున్న 6 లక్షల ఉద్యోగాల్లో...

  • 2.59లక్షలు ఇవి వలంటీరు పోస్టులు. వీరిది ‘సేవ’, ఉద్యోగం కాదని సీఎం తేల్చిచెప్పారు.
  • 51 వేలు..ఇవి ఆర్టీసీలో ఇచ్చామంటున్న ఉద్యోగాలు. నిజానికి... వీరంతా ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. వీరిని ఆర్టీసీ నుంచి పీటీడీలోకి మార్చారు. అంతే!
  • 95 వేలు..వీరంతా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు. ‘ఆప్కోస్‌’ అనే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి... దాని పరిధిలోకి తెచ్చారు. కొత్తగా ఇచ్చిన కొలువులు కావు.
  • 26 వేలు.. కరోనా కాలంలో 6 నెలల కోసం తాత్కాలికంగా నియమించుకున్న సిబ్బంది.
  • 1.21 లక్షలు.. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగిన నియామకాలు ఇవి.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

 ‘జాబ్‌ క్యాలెండర్‌ విడుదల’ అంటూ శుక్రవారం జగన్‌ సర్కారు భారీ ఖర్చుతో పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఫొటో... వైసీపీ రంగుల పతాక రెపరెపలతో... ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం’ అని ఊదర గొట్టింది. రెండేళ్లలో 6,03,756 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపింది. శాఖల వారీగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా లెక్కలు చెప్పారు. వాటిని చూసి ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులే విస్తుపోయారు. ‘చూశారా... ఈ చిత్రం’ అంటూ  వాట్సా్‌పలో షేర్‌ చేసుకుని నవ్వుకున్నారు. ఈ రెండేళ్లలో రవాణా, ఆర్‌అండ్‌బీలో 51,387 రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేసినట్లు జగన్‌ సర్కారు ప్రకటించుకుంది. అసలు విషయం ఏమిటంటే... ఈ రెండేళ్లలో ఆర్టీసీ డ్రైవర్‌ ఉద్యోగాలకు టెస్ట్‌లు పెట్టలేదు. కండక్టర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు చేయలేదు.  క్లరికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. సూటిగా చెప్పాలంటే... ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. మరి... 51 వేలకు పైగా పర్మినెంట్‌ ఉద్యోగాలు ఎక్కడివి? ఎలా ఇచ్చారు? అని ఆర్టీసీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే... ఆ 51 వేలమందిలో ఒక్కరూ కొత్తగా నియమితులైన వారు కారు. ఏళ్లతరబడి ఉద్యోగాలు చేస్తున్న వారే. ఆర్టీసీలో 20వేల మంది డ్రైవర్లు, 18వేల మంది కండక్టర్లు, ఏడువేల మంది మెకానికల్‌ సిబ్బంది, ఆఫీస్‌ స్టాఫ్‌, ఇతర అధికారులు కలిపి 51వేల మందికి పైగా పని చేస్తున్నారు. ఆర్టీసీని గత ఏడాది జనవరిలో ప్రభుత్వంలో విలీనం చేసింది. ‘ప్రజా రవాణా శాఖ’ అనే కొత్త విభాగంలో వీరిని కలిపేసింది. అప్పటి నుంచి కార్పొరేషన్‌ ద్వారా కాకుండా... ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇదీ అసలు విషయం! కానీ... తామందరికీ జగన్‌ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడంపై ఆర్టీసీ సిబ్బంది నవ్వుకుంటున్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో ప్రైవేటు బస్సుల జాతీయీకరణ జరగడంతో ఆర్టీసీ ఆసియాలోనే పెద్ద రవాణా సంస్థగా ఏర్పడింది. అప్పట్లో ప్రైవేటు బస్సుల్లో పని చేసే కార్మికులంతా ఆర్టీసీ ఉద్యోగులుగా మారారు. త్వరలో పదవీ విరమణ చెందనున్న ఒక ఉద్యోగి మాట్లాడుతూ... ‘‘నాకు ఎన్టీఆర్‌ నిర్ణయం వల్లే ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. నాలాగా ఎందరో ఉన్నారు. ఇప్పుడు... మమ్మల్ని జగన్‌ నియమించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ ప్రకటన చూడగానే నవ్వొచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.


నిజంగా పెంచారా... 

పారిశుధ్య కార్మికులకు రూ.8000 ఉన్న జీతాలను రూ. 16,000 పెంచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ... రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకూ ఈ జీతాలు అమలు కావడం లేదు. పైగా ఇటీవల బోధనాసుపత్రులకు వచ్చిన కొత్త సర్వీస్‌ ప్రొవైడర్లు ఆ స్థాయిలో జీతాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. కేవలం రూ.8 నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. కానీ... ప్రభుత్వం మాత్రం రూ.16000 ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. 


వలంటీర్లా... ఉద్యోగులా?

జగన్‌ ప్రభుత్వం చెబుతున్న ఆరు లక్షల ఉద్యోగాల్లో... 2.59 లక్షలు గ్రామ, వార్డు వలంటీర్లే. వీరికి ప్రభుత్వం నెలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేలు మాత్రమే. ‘మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు’ అని జగన్‌ స్వయంగా గతంలో చెప్పారు. ఇంటింటికీ రేషన్‌ బియ్యం తీసుకెళ్లే వాహనాల ఆపరేటర్లకు వచ్చీ రాగానే, వారు అడిగీ అడగ్గానే జీతాలు పెంచారని... తమకూ వేతనం పెంచాలని వలంటీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అప్పుడు జగన్‌ దీనిపై ప్రత్యేకంగా స్పందించారు. ‘‘మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు. అందుకు గౌరవ వేతనం చెల్లిస్తున్నాం. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, ప్రజల్లో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి’’ అని హితోక్తులు పలికారు. కానీ... నియామకాల విషయానికి వచ్చేసరికి వలంటీర్లందరినీ ‘ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగుల కోటాలో కలిపేశారు. రెండేళ్లలో ఇచ్చామంటున్న 6 లక్షల ఉద్యోగాల్లో దాదాపు సగం వలంటీరు పోస్టులే ఉండటం గమనార్హం. మరో 1.21 లక్షల రెగ్యులర్‌ ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాలకు చెందినవి. ఈ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయడంతో... ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. 


ఔట్‌ సోర్సింగ్‌... ఇచ్చారా?

ఈ రెండేళ్లలో 95,212 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించినట్లు జగన్‌ సర్కారు ప్రకటించింది. ఇది కూడా ‘ఆర్టీసీ’ కొలువుల్లాంటి అబద్ధమే. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేయడం కొత్తేమీ కాదు. జగన్‌ కొత్తగా ఏం చేసిందంటే... అప్పటికే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న 95 వేల మందిని ఒక కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. వీరిని కొత్తగా నియమించలేదు. పోస్టులను భర్తీ చేయలేదు. వివిధ శాఖల కింద రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉండే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎక్కడికక్కడ ఉంచి... వారిని ఆ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. ‘‘సమాన పనికి సమాన వేతనం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఒకటో తేదీనే జీతాలు’’ అని జగన్‌ అప్పట్లో ప్రకటించారు. కానీ... ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసం 3 నెలల వేతనమైనా పెండింగ్‌లో ఉంటోంది.


ఏపీపీఎస్సీ పోస్టులు ఎప్పటివి?

ఏపీపీఎస్సీ ద్వారా 2497 ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్లు జగన్‌ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంది. నిజానికి... ఈపోస్టులకు 2018 డిసెంబరు 31న చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్షల ప్రక్రియ అప్పుడే ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. గ్రూప్‌-2 రాసి అర్హత సాధించి, ఉద్యోగాలు పొందిన వారికి జగన్‌ అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు అందాయి. ఇక... గ్రూప్‌ -1 పోస్టుల నియామక ప్రక్రియ కూడా చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇంటర్వ్యూలు మాత్రమే జరగాల్సి ఉంది. వాటికీ హైకోర్టు ఈనెల 16న బ్రేకులు వేసింది. జగన్‌ సర్కారు హయాంలో ఇప్పటిదాకా గ్రూప్‌ 1 , గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌  ఒక్కటీ రాలేదు. 


తొలగించారా... నియమించారా!

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఆర్టీసీలో సుమారు ఏడు వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆ సంఖ్య ఐదువేలకు పడిపోయింది. కానీ... ఆర్టీసీలో 7వేల మందికిపైగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించినట్లు తాజాగా సర్కారు చెప్పడం విశేషం.


ఎప్పుడు ఇచ్చారో!

వ్యవసాయ, సహకారశాఖల్లో గత రెండేళ్లలో 133 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ... శాఖాపరంగా ఎలాంటి నోటిఫికేషన్లూ వెలువడలేదు. కారుణ్య నియామకాలు, కోర్టు కేసులు పరిష్కారమై ఇచ్చిన పోస్టింగులను కూడా రెగ్యులర్‌ పోస్టుల భర్తీగా చూపారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.


కొత్తేముంది...?

గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వేశారు. రాతపరీక్షలు, మెరిట్‌ జాబితా కూడా సిద్ధమైంది.  కానీ... ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. వాటినీ ఇప్పుడు కొలువుల జాబితాలో చూపించారు. ఇక... సాంఘిక సంక్షేమశాఖలో ఇచ్చిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకంటే, తీసేసినవే ఎక్కువ.


‘కరోనా’వీ కొలువులేనట!

రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో చూసినా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ వేలల్లో పోస్టులు ఖాళీలున్నాయి. కరోనా సమయంలో సిబ్బంది కొరత కారణంగా ఆరు నెలల తాత్కాలిక పద్ధతిలో 26 వేల మంది సిబ్బందిని నియమించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు దానిని కూడా 6 లక్షల ఉద్యోగాల్లో కలిపేశారు. వీరంతా ఆరు నెలల పాటు మాత్రమే విధులు నిర్వహిస్తారని వారి జాయినింగ్‌ ఆర్డర్‌లోనే స్పష్టంగా చెప్పారు. వీరికి ఆరు నెలలకు గాను కేవలం నాలుగు నెలల జీతాలు మాత్రమే అందించారు. ఇలా తాత్కాలికంగా నియమించిన వారినీ 6 లక్షల మందిలో కలిపేయడం గమనార్హం. 


జీతాలు పెండిగ్‌

కొత్త ప్రభుత్వం వచ్చాక 108 సిబ్బందికి, 104 డ్రైవర్లకు, పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచామని గొప్పగా ప్రకటనలు విడుదల చేసింది. జీతాల పెంపు పక్కన పెడితే ఏ నెలలోనూ సిబ్బందికి సక్రమంగా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 108, 104 వాహనాలు నిర్వహిస్తున్న అరబిందో సంస్థకు 3 నెలల ముందే అడ్వాన్స్‌ పేమెంట్లు ఇస్తారు. 108, 104 సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు బకాయిలున్నాయి.



Updated Date - 2021-06-19T08:29:16+05:30 IST