గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:01:29+05:30 IST

లారీపై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

పాపన్నపేట, జూలై 1: లారీపై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ విజయ్‌నారాయణ వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన ఆరే భరత్‌ (47) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తోటి డ్రైవర్‌ మహమ్మద్‌ ఖబీర్‌తో కలిసి పెద్దపల్లి నుంచి ఇసుక లోడ్‌ కోసం గురువారం రాత్రి బయలు దేరారు. లారీని తోటి డ్రైవర్‌ ఖబీర్‌ నడుపుతున్నాడు. రాత్రి 12గంటల సమయంలో ఎల్లాపూర్‌ శివారులోకి చేరుకోగానే భరత్‌ ఉమ్మి వేసే ప్రయత్నంలో లారీ వేగానికి అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి డ్రైవర్‌ ఖబీర్‌ వెంటనే లారీ ఓనర్‌ వసీర్‌ పటేల్‌, కుటుంబీకులకు, పోలీసులకు సమాచారాన్ని అందించాడు. గాయపడిన భరత్‌ను  చికిత్స నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లారుజామున మృతి చెందాడు. అతి వేగంగా లారీని నడిపి తన భర్త మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ ఖబీర్‌పై చర్యలు తీసుకోవాలని భార్య సుమిత్ర ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-07-02T05:01:29+05:30 IST