స్పందనకు వినతుల వెల్లువ
ABN , First Publish Date - 2021-07-27T04:10:00+05:30 IST
కలెక్టరేట్ ‘స్పందన’ విభాగానికి సోమవారం వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ హరిజవహర్లాల్, జేసీ కిషోర్కుమార్, మహేష్కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావులు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 230 వినతులు స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు
కలెక్టరేట్, జూలై 26: కలెక్టరేట్ ‘స్పందన’ విభాగానికి సోమవారం వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ హరిజవహర్లాల్, జేసీ కిషోర్కుమార్, మహేష్కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావులు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 230 వినతులు స్వీకరించారు. ప్రధానంగా అమ్మఒడి, రైతు భరోసా, జగనన్నతోడు, కాపునేస్తం వంటి పథకాలు అందలేదని వినతులు వచ్చాయి. ఇళ్లు, ఇంటి స్థలాల కోసం సైతం వినతులిచ్చారు. తాను మూడుసార్లు వినతులిచ్చినా సమస్య పరిష్కారం కాలేదని.. ఆత్మహత్యే శరణ్యమంటూ విజయనగరం పట్టణానికి చెందిన ఓ మహిళ చెప్పగా..పోలీసులు వచ్చి సముదాయించారు. తక్షణం సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
స్పందన విభాగంలో కలెక్టర్ భోజనం
స్పందన విభాగంలో కలెక్టర్ హరిజవహర్లాల్ భోజనం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి కోసం భోజన ఏర్పాట్లు చేసినట్టు ఆయన గుర్తుచేశారు. అందరి సహకారంతోనే నడిపిస్తున్నామని.. దీన్ని కొనసాగించవలసిందిగా కొత్త కలెక్టర్ను కోరనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ భోజనానికి రూ.9 వేలు సాయంగా అందజేశారు. మెస్ యజమాని రమణను సత్కరించారు. అంతకు ముందు జేసీలు కిషోర్ కుమార్; మహేష్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావులకు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సాయంత్రం జిల్లా అధికారులు కలెక్టర్ హరిజవహర్లాల్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి, ఎస్పీ దీపికా పాటిల్, ఐదో బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్, జేసీలు కిషోర్కుమార్, ఆర్.మహేష్కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ పాల్గొన్నారు.
రోడ్లు బాగుచేయండి
జిల్లాలో పాడైన రహదారులను బాగుచేయాలని టీడీపీ నేతలు కోరారు. కలెక్టర్ హరిజవహర్లాల్కు వినతిపత్రం అందించారు. ఐవీపీ రాజు, బొద్దుల నర్సింగరావు, కర్రోతు వెంకట నర్సింగరావు, విజ్జుపు ప్రసాద్, గంట పోలినాయుడు తదితరులు కలెక్టర్ను కలిఽశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో అంతర్ రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణం వాటిని బాగు చేయాలని డిమాండ్ చేశారు.