బీట్ఫుల్ భారత్
ABN , First Publish Date - 2020-09-30T06:15:46+05:30 IST
శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంటే ఏ మనసైనా పరవశిస్తుంది. బీట్ బాగుంటే దానికి తాళం వేస్తుంది. అదే విభిన్న సంగీత రీతులకు నిలయమైన భారత్లో అయితే... ఇక ఆ ఉత్సాహం ఆకాశాన్నంటుతుంది. అందుకేనేమో... సంగీతాన్ని ఆస్వాదిస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది...
శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంటే ఏ మనసైనా పరవశిస్తుంది. బీట్ బాగుంటే దానికి తాళం వేస్తుంది. అదే విభిన్న సంగీత రీతులకు నిలయమైన భారత్లో అయితే... ఇక ఆ ఉత్సాహం ఆకాశాన్నంటుతుంది. అందుకేనేమో... సంగీతాన్ని ఆస్వాదిస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. విశేషమేమంటే మనవాళ్లు వింటున్న వాటిల్లో అత్యధికం దేశీ గీతాలే కావడం. ప్రముఖ మ్యూజిక్ స్ర్టీమింగ్ యాప్ ‘స్పూటిఫై’ మొత్తం 37 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్ల మందికి పైగా ఈ యాప్ వినియోగిస్తున్నారు.
‘‘మా యాప్ డౌన్లోడ్ చేసుకున్న 37 గ్లోబల్ మార్కెట్లలో ట్రెండ్ను పరిశీలించాం. ఎంతసేపు మ్యూజిక్ను విన్నారనేది ప్రామాణికంగా తీసుకున్నాం. అలా 2019 నుంచి భారత్ మూడో స్థానంలో ఉంది. ఇందులో 75 శాతం మంది 29 సంవత్సరాల లోపువారే. ఆది, సోమ వారాల్లో స్ర్టీమింగ్ అధికంగా ఉంటోంది. అన్ని దేశాల్లో మధ్యాహ్న భోజన సమయంలో వినేవారే ఎక్కువ’’ అని సంస్థ పేర్కొంది.
కాగా, ఈ రేటింగ్స్లో బ్రెజిల్, మెక్సికో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఇండోనేషియా, అర్జెంటీనాలు టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.