పాతపట్నంలో దువ్వాడ అనుచరుల హల్చల్
ABN , First Publish Date - 2021-03-01T05:42:04+05:30 IST
వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఆదివారం పాతపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థాన
పాతపట్నం, ఫిబ్రవరి 28: వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఆదివారం పాతపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థానకులతో గొడవకు దిగారు. దీంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసరావుకు వైసీపీ అధిష్టానం ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక నీలమణి దుర్గ ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు 150 మంది వరకూ వచ్చారు. అందులో కొందరు ఆలయ సమీపంలోని మామిడి తోటలో మద్యం తాగుతుండగా స్థానికులు ప్రశ్నించారు. భక్తులు వంటలు చేసుకునే ప్రాంతమని.. ఇక్కడ మద్యం తాగొద్దని సూచించారు. దీంతో ఈ వివాదం చినిచినికి గాలివానలా మారింది. వివాదంగా మారడంతో కొందరు స్థానికులపై రాళ్లు రువ్వారు. దీంతో ప్రవళ్లిక అనే యువతికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు స్థానిక సీహెచ్సీకి తరలించారు. ఇంతలో స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు వెనక్కి తగ్గినట్టు అక్కడున్న స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిపై బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఎంతటివారైనా చర్యలు తప్పవని సీఐ రవిప్రసాద్ తెలిపారు. కాగా ఈ ఘటనతో పాతపట్నంలో కలకలం చోటుచేసుకుంది.