రాత్రంతా భర్త మృతదేహం వద్దే..
ABN , First Publish Date - 2021-05-11T09:21:00+05:30 IST
ఓ వైపు భర్త మృతదేహం..మరోవైపు పిల్లల రోదనలు..రాత్రంతా మృతదేహం వద్దే బికుబిక్కుమంటూ గడిపారు. కొవిడ్ మృతుడి కుటుంబీకుల కష్టాలివి
రాజాం రూరల్, మే 10: ఓ వైపు భర్త మృతదేహం..మరోవైపు పిల్లల రోదనలు..రాత్రంతా మృతదేహం వద్దే బికుబిక్కుమంటూ గడిపారు. కొవిడ్ మృతుడి కుటుంబీకుల కష్టాలివి. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో షేక్ పీరుసాహెబ్ కొన్నేళ్లుగా టిఫిన్ షాపు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన ఆదివారం రాత్రి మృతిచెందారు. అంత్యక్రియులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. భార్య షేక్ ఫాతిమా, పిల్లలు భోరున విలపిస్తూ రాత్రంతా మృతదేహం వద్ద గడిపారు. సోమవారం ఉదయం పది గంటల వరకూ ఇదే పరిస్థితి. అధికారులకు విషయం చేరవేసినా వారి జాడ లేదు. కరోనాతో మృతి చెందడంతో కాలనీవాసులు కూడా ధైర్యం చేయలేదు. చివరకు విషయం తెలుసుకున్న ముస్లిం పెద్దలు షేక్ ఖాసిం, షేక్ హుస్సేన్, షేక్ యూసఫ్, షేక్ ఇమాంలు పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహించారు.