Shyam Rangeela: ఎవరీ శ్యామ్ రంగీలా.. సోషల్ మీడియాలో స్టార్ కమెడియన్ అయిన ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2022-08-11T00:09:20+05:30 IST
శ్యామ్ రంగీలా.. ఈ పేరు మొన్నటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఒకే ఒక్క షో ద్వారా అతడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మిమిక్రీ ఆర్టిస్టుగా అందరి నోళ్లలో..
శ్యామ్ రంగీలా.. ఈ పేరు మొన్నటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఒకే ఒక్క షో ద్వారా అతడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మిమిక్రీ ఆర్టిస్టుగా అందరి నోళ్లలో నానుతున్నాడు. ఒక్కప్పుడు ఇతడి మిమిక్రీ (Mimicry) విన్న రాజకీయ నాయకులకు కోపం వచ్చింది. అప్పట్లో అతన్ని స్టేజి నుంచి కూడా కిందకు నెట్టేశారు. అలాగే ఇతడి షోను పలు టీవీ చానళ్లు (TV channels) కూడా నిషేధించాయి. ప్రస్తుతం స్టార్ కమెడియన్గా (Star comedian) నెట్టింట హల్చల్ చేస్తున్నాడు. ఇతడి బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం హనుమాన్గఢ్లోని శ్రీగంగానగర్లోని మొఖమ్వాలా గ్రామంలో జన్మించిన శ్యామ్ సుందర్కు.. మొదటి నుంచీ మిమిక్రీ చేయడమంటే ఇష్టం. మొదట్లో తన గ్రామానికి చెందిన పలువురి వాయిస్లను ఇమిటేట్ చేసేవాడు. 2012లో 12వ తరగతి పూర్తి చేసి యానిమేషన్ కోర్సు చేసేందుకు జైపూర్కి వచ్చాడు. అనంతర కాలంలో 2014లో లోక్సభ ఎన్నికల సందర్భంగా స్టేజీపై మోదీని అనుకరించాడు. ఈ సందర్భంగా అతడి మిమిక్రీ.. ఓ ఎంపీకి నచ్చకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొందరైతే అతడ్ని స్టేజీ నుంచి కిందకు నెట్టేశారు. అయితే అతడి మొదటి మిమిక్రీ షోకు నిర్వాహకులు రూ.1000అందజేశారు. ఇదే అతడి మొదటి సంపాదన. ప్రధాని మోదీ వాయిస్ను అనుకరించేందుకు సుమారు ఏడాది పాటు కష్టపడ్డానని శ్యామ్ తెలిపాడు. రంగీలా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇతడు శ్యామ్ రంగీలాగా అందరికీ సుపరిచితుడయ్యాడు. 2017లో మోదీతో పాటూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుకరించడం మానేయమని తనను పలువురు కోరినట్లు తెలిపాడు.
అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..
కొన్నిసార్లు అతడి షోలు వివాదాస్పదమవడంతో ప్రసారం చేసేందుకు టీవీ షోలు కూడా నిరాకరించాయి. దేశంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటిన సందర్భంగా రంగీలా చేసిన వీడియో బాగా వైరల్ అయింది. 2016లో ‘‘ఇండియాస్ గాట్ టాలెంట్’’ అనే కార్యక్రమం కోసం శ్యామ్ను ఆడిషన్ కోసం ముంబైకి పిలిపించారు. మూడో రౌండ్ వరకూ వెళ్లాడు. అయితే టీవీలో మాత్రం ఇతడి షో ప్రసారం చేయలేదు. ఆ సమయంలో గ్రామస్తులు అతడిని ఎగతాళి చేయడంతో కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో 2017 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' కార్యక్రమంలో మిమిక్రీ చేసేందుకు అవకాశం వచ్చింది. 2014కు ముందు బీజేపీకి (BJP) ప్రసారం చేసిన శ్యామ్.. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) మద్దతుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇతడి య్యూటూబ్ చానల్కు ప్రస్తుతం లక్షల్లో సబ్స్కైబర్లు ఉన్నారు. ప్రస్తుతం మిమిక్రీ చేస్తూనే నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.