కొండను తవ్వి... ఉడత తోక పట్టారు

ABN , First Publish Date - 2022-07-02T08:55:37+05:30 IST

కొండను తవ్వి... ఉడత తోక పట్టారు

కొండను తవ్వి... ఉడత తోక పట్టారు

ఉడతకు ఏకంగా పోస్టుమార్టం

‘ముద్దాయి’ని చేసి దానిచుట్టే దర్యాప్తు

తాడిమర్రి, జూలై 1: శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు కూలీలను బలిగొన్న విద్యుదాఘాత ప్రమాదంలో అనూహ్యంగా తెరపైకి తెచ్చిన ఉడత కథను అధికారులు మరో విచిత్ర మలుపు తిప్పారు. ఉడతను ముద్దాయిని చేసిన అధికారులు...దానికి ఏకంగా పోస్టుమార్టం కూడా చేయించారు. ఉడత వల్లనే కరెంటు వైరు తెగి ఆటోపై పడి..అందులో ప్రయాణిస్తున్న కూలీలను బలిగొన్నదని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాథరావు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఉడత చుట్టూ దర్యాప్తు మొదలైంది. విచారణకు వచ్చిన అధికారులందరూ ఉడత ఎక్కడ కనిపించింది? వైర్లకు ఎక్కడ తగులుకుంది? ఎక్కడ పడిపోయింది? అని ఆరాతీశారు. అదేరోజు సాయంత్రం తాడిమర్రి పోలీసులు ఉడత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక పశువైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పశువైద్య అధికారి స్వర్ణలత ఉడతకు గురువారం పోస్టుమార్టం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేసేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 


మొదలైన విచారణ

ప్రమాదంపై విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలు అడిగితే మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకొని వెళ్లిపోయారు. తిరుపతి నుంచి వచ్చిన చీఫ్‌ విజిలెన్స్‌ మహిళా అధికారి లావణ్య లక్ష్మి, ఈఈ జేవీ రమేశ్‌ శుక్రవారం గుడ్డంపల్లి గ్రామానికి వెళ్లారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని విచారించారు. వారి నుంచి సమాచారం సేకరించి, రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తరువాత ప్రమాద స్థలానికి చేరుకుని, దగ్ధమైన ఆటోను, తెగి పడ్డ విద్యుత్‌ వైరును పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏ వైరులో విద్యుత్‌ సరఫరా అవుతుందని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్య వైరులో సింగిల్‌ ఫేస్‌ కరెంటు సరాఫరా అవుతోందని, ఉదయం ఎనిమిది గంటలకు త్రీ ఫేస్‌ కరెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్థానిక అధికారులు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు దాడితోట సబ్‌స్టేషన్‌లో లైన్‌ ట్రిప్‌ అయిందా లేదా అనేది ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఉద్యోగి రాఘవను అడిగి తెలుసుకున్నారు. లాగ్‌బుక్‌ను తెప్పించుకుని, తాడిమర్రి సబ్‌ స్టేషన్‌లో రహస్యంగా ఆయనను విచారించారు. ప్రమాద సమయంలో ఎంతస్థాయి కరెంటు ప్రవహిస్తోందని అడిగి నమోదు చేసుకున్నారు. వైరు తెగిపడటంలో ఉడత ప్రభావం ఏమైనా ఉంటుందా అంటూ వారు చర్చించుకున్నారు. విచారణ వివరాలను తెలపాలని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లావణ్యలక్ష్మిని కోరగా ‘మా ఇన్‌స్పెక్టర్‌ చెబుతారు’ అంటూ కారులో వెళ్లిపోయారు. ఆ వెనుకనే వచ్చిన విజిలెన్స్‌ సీఐ విజయ్‌ భాస్కర్‌రెడ్డి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. 

Updated Date - 2022-07-02T08:55:37+05:30 IST