అందేంత ఎత్తే తారాతీరం..
ABN , First Publish Date - 2021-09-17T08:46:26+05:30 IST
అంతరిక్ష పర్యాటకంలో మరో కొత్త మైలురాయి. శిక్షణ పొందిన వ్యోమగాములు కాకుం డా నలుగురు సాధారణ పౌరులు రోదసిలోకి వెళ్లారు.
- నలుగురు సాధారణ పౌరులను రోదసిలోకి పంపిన స్పేస్ ఎక్స్
- 3 రోజులపాటు వారు భూకక్ష్యలోనే!
- అంతరిక్ష పర్యాటకంలో మరో ఘనత
- అమెరికాలోని కేన్సర్ ఆస్పత్రికి విరాళాలు సేకరించే లక్ష్యంతోనే యాత్ర
ఫ్లోరిడా, సెప్టెంబరు16: అంతరిక్ష పర్యాటకంలో మరో కొత్త మైలురాయి. శిక్షణ పొందిన వ్యోమగాములు కాకుం డా నలుగురు సాధారణ పౌరులు రోదసిలోకి వెళ్లారు. ఇలా వెళ్లి అలా వచ్చేయడం కాదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్నా ఎత్తులో, భూ కక్ష్యలో 3 రోజులపాటు విహరించనున్నారు! సాధారణ పౌరులు రోదసిలోకి వెళ్ల డం ఇదే తొలిసారి కాదు. వెళ్లిన నలుగురూ సామాన్యు లే కావడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను, సరుకులను అలవాటుగా పంపించే స్పేస్ ఎక్స్ సంస్థ అంతే అలవోకగా అతి సా మాన్యులనూ పంపించి సత్తా చాటింది. కొన్నాళ్ల క్రితం వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కొంతమందితో అలా రోదసిలోకి వెళ్లి, ఇలా వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. కానీ, స్పేస్ ఎక్స్ సంస్థ తన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘క్రూ డ్రాగన్’ అనే క్యాప్సూల్లో నలుగురు సాధారణ పౌరులను 3 రోజుల అంతరిక్ష యాత్రకు పంపి సత్తా చాటింది. ఆ నలుగురూ.. జారెడ్ ఐజాక్మ్యాన్, హేలీ ఆర్సెనో, సియాన్ ప్రోక్టర్, క్రిస్ సెంబ్రోస్కీ. ఫ్లోరిడా (అమెరికా)లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకా రం సెప్టెంబరు 15 రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం సెప్టెంబరు 16 తెల్లవారుజామున 5 గంటలకు) ఫాల్కన్ 9 రాకెట్ ఈ నలుగురినీ మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది.
‘ఇన్స్పిరేషన్-4’ మిషన్ వెనుక కథ
నలుగురు సాధారణ పౌరులను రోదసిలోకి పంపే ఈ మిషన్కు స్పేస్ ఎక్స్ సంస్థ ‘ఇన్స్పిరేషన్-4’గా నామకరణం చేసింది. కేన్సర్ బారిన పడిన చిన్నారులకు ఉచితంగా చికిత్స చేసే సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రిసెర్చ్ ఆస్పత్రికి(టెన్నిసీలోని మెంఫి్సలో ఉందీ ఆస్పత్రి) నిధు లు సమకూర్చడమే లక్ష్యంగా యువ బిలియనీర్, ‘షిఫ్ట్4పేమెంట్స్’ సంస్థ అధిపతి ఐజాక్మ్యాన్ ఈ యాత్రను తలపెట్టారు. ఇందుకోసం ఆయన స్పేస్ ఎక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం పర్యటనకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ ఆయనే భరిస్తున్నారు. చార్టర్డ్ రాకెట్ను బుక్ చేసుకుని తనతోపాటు మరోముగ్గురిని రోదసియాత్రకు తీసుకెళ్తున్నారు. మూడు సీట్లలో రెండింటిని సెయింట్జూడ్ ఆస్పత్రికి కేటాయించారు.
క్రూ డ్రాగన్..
20 అడుగుల ఎత్తు, 12 అడుగుల వ్యాసం ఉండే క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఏడుగురు వ్యోమగాములను రోదసిలోకి తీసుకెళ్ల గలదు. గంటకు 17 వేల మైళ్ల వేగంతో ప్రతి 90 నిమిషాలకొకసారి భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. 3 రోజుల యాత్ర పూర్తయ్యాక ఈ క్యాప్సూల్ భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించి సాఫ్ట్ వాటర్ ల్యాండింగ్ విధానంలో ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది.