బియ్యం దందా వెనుక వైసీపీ పెద్దల హస్తం
ABN , First Publish Date - 2022-01-23T05:05:25+05:30 IST
ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం అక్రమ దందా వెనుక నియోజకవర్గ వైసీపీ పెద్దాయన హస్తంతో పాటు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపిం చారు.
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపణ
ప్రొద్దుటూరు అర్బన్, జనవరి 22 : ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం అక్రమ దందా వెనుక నియోజకవర్గ వైసీపీ పెద్దాయన హస్తంతో పాటు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపిం చారు. శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లింగాపురం వద్ద ప్రైవేటు గోడౌన్లో రేషన్ బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ పెట్టారని రూరల్ పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు ఎందుకు గోడౌన్ను సీజ్ చేసి సరుకును స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. రెండు రోజులు గోడౌన్ వద్దకు సిబ్బంది వెళ్ళకుండా అందులోని వందలాది బస్తాల అక్రమ బియ్యం లారీల్లో తరలివెళ్ళాక శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళి 42 బస్తాలు దొరికాయని వెల్లడిస్తారా అని అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళలేదంటేనే దాని వెనుక ప్రభుత్వంలో వున్న నియోజకవర్గ పెద్ద హస్తం ఉండటం వల్లే దాడులు ఆపగలిగారన్నారు. అక్రమ రేషన్ బియ్యం దందా నడిపిస్తున్న దాంట్లో వైసీపీకి చెందిన ఇలియాస్ అనే నాయకుడు ప్రధాన సూత్రదారిగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్ను కలిసి కోట్ల రూపాయల రేషన్ బియ్యం అక్రమ దందాకు సహకరించే రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బచ్చల పుల్లయ్య, మాజీ కౌన్సిల్లర్ తలారి పుల్లయ్య, మాకం అశోక్, గుర్రప్ప పాల్గొన్నారు.