గాడి తప్పుతున్న ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ

ABN , First Publish Date - 2021-02-23T06:10:48+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు సంబంధించి వేతన సవరణ కమిషన్ చేసిన సిఫారసులపై ఉద్యోగుల ఆందోళన...

గాడి తప్పుతున్న ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ

ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు సంబంధించి వేతన సవరణ కమిషన్ చేసిన సిఫారసులపై ఉద్యోగుల ఆందోళన విచిత్రంగా ఉంది. తెలంగాణ అంటే తాము మాత్రమే అనే ధోరణితో వీరు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బడ్జెట్‌లో మెజారిటీ వాటా మాకే కావాలి, ఆ తరువాతనే మిగతా ప్రజలకు దక్కాలన్న రీతిలో ఉద్యోగుల డిమాండ్లు ఉన్నాయి. సామాన్య ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉండటంతో, కొన్ని వర్గాల ప్రజల్లో అసహనం, అశాంతి, ఆందోళన ఎక్కువవుతున్నాయి. వేతన సవరణ కమిషన్ నివేదిక ప్రకారం, రాష్ర్ట రెవెన్యూలో 50 శాతం అంటే, ప్రస్తుతం ఏటా 35వేల కోట్ల రూపాయలు పైగా వీరి జీతాలు, పింఛన్లకే సరిపోతుంది. కమిషన్ సిఫారసు మేరకు 7.5 శాతం ఫిట్‌మెంట్ అంటే 2,252 కోట్ల రూపాయల అదనపు భారమే. ఈసారి 50శాతం ఇవ్వాలని లేదా 63 శాతం ఇవ్వాలని చేస్తున్న ధర్నాలు, కోరికలు ఏ మాత్రం సబబుగా లేవు. వాటిని అంగీకరించి రాష్ట్ర రెవెన్యూలో 50 శాతం పైగా ఉద్యోగులకే చెల్లిస్తే మిగతా మూడున్నరకోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం మాటేమిటి? పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని గమనించకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఆందోళనకు దిగడం సరైందికాదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులపట్ల ప్రజల్లో గౌరవభావం పూర్తిగా తగ్గిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కువగానే వేతనాలు ఇస్తోందనే భావం ప్రజల్లో ఉంది. వేతన సవరణ సంఘం కూడా ఈ అంశాలను తన నివేదికలో పేర్కొంది. సామాన్య ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయటం లేదని వారిలో అవినీతి, అలసత్వం బాగా పెరిగిపోయిందంటూ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా వేతన సంఘం తన నివేదికలో పొందుపరచింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీనిని కూడా పరిశీలించాలి. ప్రభుత్వం కేవలం లక్షమంది ఉద్యోగుల గురించే కాకుండా మూడున్నరకోట్ల ప్రజల గురించి కూడా ఆలోచించాలి. 

నర్రా విజయ్ కుమార్

Updated Date - 2021-02-23T06:10:48+05:30 IST