కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-31T06:20:42+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి జీవనానికి ఇబ్బంది పడుతున్న కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకోవాలని కళాకారుల సంఘం జిల్లా నాయకుడు, ప్రముఖ చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు.

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

సంఘం జిల్లా నాయకుడు రూపం వెంకట్‌రెడ్డి


ఆమనగల్లు : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి జీవనానికి ఇబ్బంది పడుతున్న కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకోవాలని కళాకారుల సంఘం జిల్లా నాయకుడు, ప్రముఖ చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు. గత ఎనిమిది నెలల కాలంగా ఉపాధి లేక జిల్లా వ్యాప్తంగా వేల మంది కళాకారులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమనగల్లులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజలను చైతన్యం చేయడంలో కళాకారులు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. 


కొవిడ్‌-19 నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామాల్లో కరోనా వల్ల కలిగే అనర్థాలను, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ల ధరింపు అవశ్యకత, పోలీసుల, వైద్యుల, పారిశుధ్య కార్మికుల సేవలను వివరిస్తూ అనేక చోట్ల చిత్రాల ద్వారా ప్రజలను చైతన్యం చేసినట్లు చెప్పారు. 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు రూ.5 వేలు పింఛన్‌, ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాల్లో కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో కళాకారులు కొండల్‌, లింగం, గోపి, గిరి, శ్రీనివాస్‌, మల్లేశ్‌, రాము, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:20:42+05:30 IST