ప్రజల చెంతకు సర్కారు వైద్యం
ABN , First Publish Date - 2020-06-01T10:56:53+05:30 IST
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత నగరంలో వైద్యరంగానికి ప్రాధ్యానం పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుతెన్నులు
హైదరాబాద్ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత నగరంలో వైద్యరంగానికి ప్రాధ్యానం పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. నగరంలో పేరొందిన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల రూపురేఖలు మారిపోతున్నాయి. నగరంలో బస్తీదవాఖానాలు ఏర్పాటు చేసి, ప్రజల ముంగిట్లోకి వైద్యాన్ని తీసుకొచ్చారు. మల్కాజిగిరి బీజేఆర్నగర్లో 16 బస్తీ దవాఖానాలతో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, దశలవారీగా వాటిని పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 168 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో డివిజన్కు కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఉండే విధంగా సంఖ్యను పెంచనున్నారు.
25 యూపీహెచ్సీల్లో స్పెషాలిటీ వైద్యం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ప్రస్తుతం 25 యూపీహెచ్సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి వైద్య సేవల కోసం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ప్రసూతి ఆస్ప్రతులకు వెళ్లాలి ఉండగా, ప్రస్తుతం ఈ స్పెషాలిటీ క్రేందాల్లోనే వైద్యం పొందుతున్నారు.
మల్టీ ఆస్పత్రుల ఆలోచన
గ్రేటర్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించే యోచనలో ప్రభుత్వముంది. ఎల్బీనగర్-నాగోల్, మల్కాజిగిరి-ఉప్పల్, కూకట్పల్లి-కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది.