దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2021-02-27T06:08:12+05:30 IST

ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
కుంటాల గజ్జలమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి అల్లోల

దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

కుంటాల, ఫిబ్రవరి 26 : ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్జలమ్మ ఆలయ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనకు ఆలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి అభిషేకం,అర్చన చేసి, శేషవస్త్రంతో ఆశీర్వచనం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో దేవా లయాల అభివృద్ధిని గతంలో ఎవరూ పట్టించుకోలేదని, గతంలో దేవాదాయ శాఖ నిధులు మంజూరు ఇవ్వాలంటే కొంత మేర ఆయా గ్రామాల నుండి నిధు లు చెల్లించాల్సి ఉండేదని, ప్రస్తుతం అలాంటిది ఏమి లేకపోవడం వలన తాను దేవాదాయశాఖ మంత్రిగా ఎన్నికైనప్పటి నుండి ఉమ్మడి జిల్లాతో పాటు తెలం గాణ రాష్ట్రంలోనే పురాతన, అన్నిరకాల దేవాలయాల అభివృద్ధి కొరకు ప్రత్యేకం గా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలు సుభిక్షంగా ఉండాలని హరిత ఛండీయాగాన్ని చేపట్టాడని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని గ్రామస్తులు పేర్కొనగా, ఆలయం చుట్టూ ప్రహరీగోడ, గోపురం నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ప్రజల కు భక్తిభావం పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారని ఇందుకు నిదర్శనం ఈ నెల 24 నుంచి 27 వరకు కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అధికసంఖ్యలో హాజరు కావడమే అన్నారు. అనంతరం ముఽథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి గజ్జలమ్మను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసీఎస్‌ రాంకిషన్‌ రెడ్డి, ఆత్మ చైర్మన్‌ సవ్య అశోక్‌రెడ్డి, ఎంపీపీ ఆప్క గజ్జారాంయాదవ్‌, సర్పంచ్‌ సమత, పీఏసీఎస్‌ చైర్మన్‌ సట్ల గజ్జారాం, మండల చైర్మన్‌ పడకంటి దత్తు, జిల్లా నాయకులు రమణారావు,తో పాటు ఆయా గ్రామాల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. 

ముగిసిన ఆలయ వార్షికోత్సవం

కుంటాల : మండల కేంద్రం కుంటాలో గజ్జలమ్మ ఆలయ వార్షికోత్సవం శుక్ర వారంతో ముగిసింది. గత 5 రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా శుక్రవారం ఉదయం శతచంఢీయాగం శుక్రవారం ముగిసింది. ఉదయం నుండి నిత్యనిధి పారాయణం, చంఢీహోమం, పరిప్రదానం, పూర్ణాహుతి, బోనాల సమర్పణ, పండిత సన్మానం, తదితర కార్య క్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి పుట్టింటి ఆడపడుచులు కుంటాలకు చేరుకొని నెత్తిన బోనాలతో అమ్మవారిని దర్శించు కున్నారు. వందలసంఖ్యలో మహిళలు ఎత్తిన బోనాలతో గ్రామం ప్రధాన వీధు లగుండా ఊరేగింపుగా ఆలయం వద్దకు వెల్లి అమ్మవారిని నైవేద్యాలను సమ ర్పించి మొక్కులు తీర్కుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు.

నిర్మల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకచర్యలు 

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 26 : నిర్మల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున ఆయన ఆనంతపేట్‌ శివారులో 2 కోట్ల రూపాయలతో బురద చికిత్స ప్లాంట్‌, పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం, డంపింగ్‌ యార్డ్‌ పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీల్లో మొదటి దశల్లో ఎంపిక చేసిన ఆరింటిలో నిర్మల్‌ పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంపికైందన్నారు. గాజుల పేట్‌, సోఫీనగర్‌తో పాటు పలు రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్‌ పైలెట్‌ ప్రాజెక్టు ఎంపికైనట్లు వివరించారు. ప్లాంట్‌ నిర్మాణంతో సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను చికిత్స అనంతరం ఎరువుగా మార్చడం జరుగుతుందన్నారు. జడ్పీటీ చైర్‌ పర్సన్‌ కే. విజయలక్ష్మీ, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌, కమిషన్‌ బాలక్రిష్ణ, నాయకులు రాంకిషన్‌రెడ్డి, రాజేందర్‌, సత్య నారాయణ గౌడ్‌, రామేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌ విజయ, అశోక్‌ పాల్గొన్నారు. 

మైసమ్మ జాతర పోస్టర్‌ విడుదల చేసిన మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 26 : శుక్రవారం రోజున తన నివాసంలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర పోస్టర్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మార్కెట్‌  కమిటీ అధ్యక్షుడు నర్మదా ముత్యంరెడ్డి, ఆదివాసి రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, వెంకంగారి భూమయ్య, మొసలి చిన్నయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T06:08:12+05:30 IST