మైనర్‌ ప్రియుడితో తల్లిని చంపించిన బాలిక

ABN , First Publish Date - 2021-10-19T07:29:59+05:30 IST

ఆ ఇద్దరికీ పదిహేడేళ్లే. ఇంకా మైనారిటీ తీరలేదు. ప్రేమలో పడ్డారు. ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో కలుసుకున్నారు.

మైనర్‌ ప్రియుడితో తల్లిని చంపించిన బాలిక

అతడితో కలిసి ఉండడాన్ని చూసి  తల్లి మందలించడమే కారణం

రాజేంద్రనగర్‌, అక్టోబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరికీ పదిహేడేళ్లే. ఇంకా మైనారిటీ తీరలేదు. ప్రేమలో పడ్డారు. ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలిక తల్లి.. కూతుర్ని మందలించింది. అంతే.. కోపంతో ఆ బాలిక తన మైనర్‌ ప్రియుడిని పిలిపించి తల్లిపైకి ఉసిగొల్పింది. అతడి దాడిలో తల్లి చనిపోయింది. హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిందీ దారుణం. రాజేంద్రనగర్‌ సర్కిల్‌కు చెందిన మహిళ (45) రోజుకూలీగా పనిచేసేది. ఆమెకు 17 సంవత్సరాల వయసున్న కుమార్తె ఉంది. ఆమె స్థానికంగా ఉండే ఓ బాలుడితో (17)తో ఆర్నెల్లుగా ప్రేమలో ఉంది. ఆ బాలుడు తరచూ ఇంటికి రావడాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను మందలించింది. అయినప్పటికీ ఆ బాలిక సోమవారంనాడు.. తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్లాక ఆ బాలుణ్ని ఇంటికి పిలిచింది. తర్వాత కొద్దిసేపటికి బాలిక తల్లి ఇంటికి రావడంతో.. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, అతడు వెళ్లడాన్ని గమనించిన తల్లి.. కుమార్తెపై గట్టిగా కోప్పడింది. తల్లి తనను తిట్టడాన్ని జీర్ణించుకోలేని బాలిక.. తన ప్రియుణ్ని మళ్లీ ఇంటికి పిలిచి, విషయం చెప్పింది. ఆ కుర్రాడు బాలిక తల్లి ఛాతీపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలికను, ఆమె ప్రియుణ్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, పోలీసులు మాత్రం వారి కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-10-19T07:29:59+05:30 IST