ప్రేమగా చూడడం లేదని తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న బాలిక.. ఆఖరకు అందరినీ ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2021-10-21T02:21:25+05:30 IST

ఇంట్లో ప్రేమ చూపలేదని కక్ష పెంచుకున్న బాలికలను ఎక్కడైనా చూసుంటామా.. కానీ ఇది నిజం. పిల్లలపై దాడులు చేసే తల్లిదండ్రులు ఉంటారు. అయితే తల్లిదండ్రులపై ప్రతీకారం తీర్చుకునే కూతుళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..

ప్రేమగా చూడడం లేదని తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న బాలిక.. ఆఖరకు అందరినీ ఏం చేసిందంటే..!

ప్రేమ పేరుతో ఎంతో మంది బాలికలు జీవితాన్ని నాశనం చేసుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంట్లో ప్రేమ చూపలేదని కక్ష పెంచుకున్న బాలికలను ఎక్కడైనా చూసుంటామా.. కానీ ఇది నిజం. పిల్లలపై దాడులు చేసే తల్లిదండ్రులు ఉంటారు. అయితే తల్లిదండ్రులపై ప్రతీకారం తీర్చుకునే కూతుళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో.. కర్ణాటకలో జరిగిన ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది...


కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఇసాముద్ర పరిధిలో జూలై నెలలో చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె(17) చిన్న తనం నుంచి వారి అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. అక్కడ ఆమెను గారాబంగా చూసుకునేవారు. అయితే మూడేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే ఈ క్రమంలో తనను సరిగా చూసుకోవడం లేదని భావించింది. చెల్లి, అన్నపై చూపించినంత ప్రేమ తనపై చూపించడం లేదంటూ రోజూ గొడవపడేది.


కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్న బాలిక.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది. చివరికి వారందరినీ చంపేయాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఆహారంలో విషం కలిపింది. అయితే అదృష్టవశాత్తు అంతా తప్పించుకున్నారు. దీంతో అదును కోసం వేచి చూస్తున్న బాలిక.. ఈ ఏడాది జూలైలో మళ్లీ అన్నంలో పురుగుల మందు కలిపింది. ఈసారి మాత్రం స్వయంగా తానే అందరికీ వడ్డించింది. కన్న కూతురే ఇలా చేస్తుందని ఊహించని కుటుంబసభ్యులు.. అది తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లి, తండ్రి, చెల్లి, అమ్మమ్మ చనిపోయారు. బాలిక అన్న మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసుల విచారణలో బాలిక నేరాన్ని అంగీకరించింది. మైనర్‌ కావడంతో బాలికను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

Updated Date - 2021-10-21T02:21:25+05:30 IST