ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై బాలిక ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-05-29T11:48:47+05:30 IST

ప్రేమించమని వేధించడంతోపాటు తన కోరిక తీర్చమని బెదిరిస్తున్న యువకుడిపై మైనర్లు అయిన అక్కాచెల్లెళ్లు గురువారం ..

ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై బాలిక ఫిర్యాదు

స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు

సరిహద్దు తగాదాలే కారణమా?


అమలాపురం రూరల్‌, మే 28: ప్రేమించమని వేధించడంతోపాటు తన కోరిక తీర్చమని బెదిరిస్తున్న యువకుడిపై మైనర్లు అయిన అక్కాచెల్లెళ్లు గురువారం అమలాపురం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తన బిడ్డలను రక్షించాలంటూ గల్ఫ్‌ దేశంలో ఉంటున్న బాలికల తల్లి సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేయడంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడి రాజ్యలక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఆ రెండు కుటుంబాలకు మధ్య సరిహద్దు తగాదా ఇక్కడి దాకా దారితీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని అమలాపురం పట్టణ సీఐ జి.సురేష్‌బాబు గురువారంరాత్రి విలేకరులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. మండల పరిధిలోని గ్రామానికి చెందిన మైనర్లు అయిన అక్కాచెల్లెళ్లను అదే ప్రాంతానికి చెందిన యువకుడు వేధిస్తున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


బాలికల తల్లి ఉపాధి నిమిత్తం కొంతకాలంగా గల్ఫ్‌ దేశంలో ఉంటున్నారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉన్న తన ఆడబిడ్డలను రక్షించాలంటూ ఆమె దుఃఖిస్తూ సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకుడిని సైతం విచారించారు. ఆ రెండు కుటుంబాలకు కొంతకాలంగా సరిహద్దు తగాదాలు ఉన్నాయని, ఆ సమస్య పరిష్కారం కోసం గ్రామపెద్దలు ఈ నెల 26న గ్రామంలో సమావేశం నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారంకాలేదు.


ఇదే సరిహద్దు వ్యవహారంపై గల్ఫ్‌ దేశంలో ఉన్న బాలికల తల్లి గ్రామపెద్దలకు వాయిస్‌ మెస్సేజ్‌లను పంపించారు. సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు. బాలికలను వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం, బాలికల తల్లి సెల్ఫీ వీడియోను విడుదల చేయడం వెనుక కారణాలను పరిశీలిస్తున్నామని పట్టణ సీఐ సురేష్‌బాబు తెలిపారు. సెల్ఫీ వీడియోపై స్పందించిన మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి ఐసీడీఎస్‌ అధికారులతో విచారణ జరిపించారు.

Updated Date - 2020-05-29T11:48:47+05:30 IST