బాలల భవిష్యత్తుకు పునాది వేయాలి
ABN , First Publish Date - 2021-04-17T05:28:00+05:30 IST
బాలల భవిష్యత్తుకు పునాది వేయాలి
- రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు జ్యోతి
మేడ్చల్ అర్బన్ : బాలల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె మాట్లాడుతూ మహిళ, శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలల చట్టాల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల అడ్డగింత, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధక చట్టం అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటుక బట్టీలు, హోటళ్లు, టోల్ప్లాజాలు, బస్టాండ్లు, తదితర ప్రదేశాల్లో బాలకార్మికులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారని, పోలీసు, కార్మిక, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ శ్వేతామహంతిని మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. సమావేశంలో డీఆర్వో లింగ్యానాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.