గతం మరచిన చిదంబరం

ABN , First Publish Date - 2021-03-17T06:45:42+05:30 IST

మాజీ కేంద్రమంత్రి చిదంబరం మార్చి 13న తమ ‘పళని పలుకు’లో ‘మధ్యతరగతి మహా విషాదం’ గురించి వాపోవడం ఆశ్చర్యం కలిగించింది...

గతం మరచిన చిదంబరం

మాజీ కేంద్రమంత్రి చిదంబరం మార్చి 13న తమ ‘పళని పలుకు’లో ‘మధ్యతరగతి మహా విషాదం’ గురించి వాపోవడం ఆశ్చర్యం కలిగించింది. నేటి పాలకులు ప్రజా ఉద్యమాల మీద సాగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగాను, ప్రజా సమస్యలమీదను దేశంలోని మధ్యతరగతి ప్రజానీకం స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ప్రజాస్వామ్య పరిసమాప్తి త్వరితమవుతుందని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు చిదంబరం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రజాఉద్యమాల మీద సాగించిన దమన కాండ, బూటకపు ఎన్‌కౌంటర్లు అయన అప్పుడే మరిచిపోయినా ప్రజలు, ఆయన పేర్కొనిన మధ్య తరగతి మరిచిపోలేదు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎదగనివ్వకుండా రక రకాల నియంతృత్వ చట్టాలకు ప్రాణం పోసి క్రూర నిర్బంధాన్ని అమలుచేసింది. ఇప్పుడు భాజపా నాయకత్వంలో సాగుతోన్న నిర్బంధం, కాంగ్రెస్ పెంచిపోషించిన అప్రజాస్వామిక విధానాల పరాకాష్ట ,కొనసాగింపు మాత్రమే! తాము అధికారంలో లేనప్పుడు ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా పోరాటాలు గుర్తుకు రావడం పాలక పార్టీలకు పరిపాటే! గతంలో అధికారంలో లేనప్పుడు అధిక ధరలకు వ్యతిరేకంగా రోడ్డున పడి పోరాటాలు చేసిన భాజాపా శ్రేణులు నేడు అధికారంలోకి రాగానే ధరలు పెంచడమే అందుకు ఓ ఉదాహరణ! చిదంబరం స్వయంగా రంగంలోకి దిగి నేటి నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తేనే జనం ఆయనను నమ్ముతారు.

దినకర్

Updated Date - 2021-03-17T06:45:42+05:30 IST