రైతు మెడకు మీటరుతో ఉరితాడు
ABN , First Publish Date - 2022-08-07T06:28:50+05:30 IST
రైతు మెడకు మీటర్ అనే ఉచ్చు బిగించి వ్యవసాయ రంగం ఊపిరి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం కావటం దారుణమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.
విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన
చందర్లపాడు, ఆగస్టు 6: రైతు మెడకు మీటర్ అనే ఉచ్చు బిగించి వ్యవసాయ రంగం ఊపిరి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం కావటం దారుణమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. చింతలపాడులో రైతులు, వామపక్షాల నాయకులతో కలసి ఆమె విద్యుత్శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రుణ పరిమితులు పెంచుకొని అప్పులు చేసి అందులో నుంచి అక్రమార్జన చేసేందుకు జగన్ మోటా ర్లకు మీటరు ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. నాలుగు వేల కోట్ల రూపాయలకు కక్కుర్తి పడిన ముఖ్యమంత్రి రైతులకు అన్యాయం చేస్తున్నాడన్నారు. తొలుత రైతులు బిల్లులు కడితే సబ్సిడీ రూపంలో తిరిగి ఇస్తామని చెపుతున్న ముఖ్యమంత్రి ఆ సబ్సిడీని ముందే విడుదల చేసి ఖజానాకు జమ చేసుకోవాలని సూచించారు. మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం మానుకోవాలని సౌమ్య డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు కోట వీరబాబు, సీపీఎం నాయకుడు చనుమోలు సైదులు, మేకల సుధాకర్, రామలింగేశ్వరరావు, దాసరి ఏసుప్రభు పాల్గొన్నారు.