రైతుకు తోడు నీడ
ABN , First Publish Date - 2020-05-31T10:17:52+05:30 IST
విత్తనం నుంచి పంట పూర్తయ్యే వరకూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు తోడూ నీడగా ఉంటాయని సీఎం వైఎస్
90 శాతం హామీల అమలు
అవినీతి, వివక్ష లేని పాలనే ధ్యేయం
ఏడాది పాలనపై సీఎం వైఎస్ జగన్
పాడురంగాపురం రైతు భరోసా కేంద్రం ప్రారంభం
నంద్యాల, మే 30: విత్తనం నుంచి పంట పూర్తయ్యే వరకూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు తోడూ నీడగా ఉంటాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల మండలం పాండురంగాపురంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన రైతు భరోసా కేంద్రాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను లైవ్ టెలికాస్ట్ వర్చ్యువల్ టూర్ ద్వారా తిలకించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న నవ రత్నాలలో 90 శాతం హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేశామన్నారు. కర్నూలు జిల్లాలో 862 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మార్కెట్ ఇంటలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన సీఎం యాప్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాల్ సెంటర్ నెంబర్ 155251 ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తామని తెలిపారు.
రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. పాండురంగాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల స్టాల్స్ను మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, జేసీలు రవి పట్టన్ శెట్టి, ఖాజా మొహిద్దీన్ పరిశీలించారు. ప్రారంభోత్సవంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, వ్యవసాయ శాఖ జేడీ విల్సన్, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమణయ్య, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త, వ్యవసాయ, అనుబంధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.