వాస్తవాలకు దూరంగా ఎగ్జిట్ పోల్స్: మాజీ సీఎం
ABN , First Publish Date - 2022-03-09T00:35:16+05:30 IST
పంజాబ్లోని వాస్తవ పరిస్థితికి ఎగ్జిట్ పోల్స్ చాలా దూరంగా ఉన్నాయి. పంజాబ్లోని ఒక్క గ్రామంలో అయినా ఆప్ లేదు. మరి ఆప్కు పంజాబ్ గ్రామాల నుంచి ఓట్లు ఎలా వస్తాయి? పంజాబ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. మళ్లీ మా ప్రభుత్వమే ఏర్పడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది..
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీ హరీష్ రావత్ విమర్శించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు మళ్లీ కుర్చీ దక్కదని ఒకటి రెండు తప్ప అన్ని సర్వేలు ప్రకటించాయి. అయితే ఈ ఫలితాలు అవాస్తవాలని, పంజాబ్లో ఆప్ ఎక్కడా లేదని హరీష్ రావత్ అన్నారు.
ఎగ్టిట్ పోల్స్పై మంగళవారం హరీష్ రావత్ స్పందిస్తూ ‘‘పంజాబ్లోని వాస్తవ పరిస్థితికి ఎగ్జిట్ పోల్స్ చాలా దూరంగా ఉన్నాయి. పంజాబ్లోని ఒక్క గ్రామంలో అయినా ఆప్ లేదు. మరి ఆప్కు పంజాబ్ గ్రామాల నుంచి ఓట్లు ఎలా వస్తాయి? పంజాబ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. మళ్లీ మా ప్రభుత్వమే ఏర్పడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మార్చి 10న అసలు ఫలితాలు వస్తాయి. అందులో కాంగ్రెస్ పార్టీదే పైచేయి’’ అని అన్నారు.