స్టడీ సెంటర్‌లోనే పరీక్షా కేంద్రం నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:53:58+05:30 IST

స్టడీ సెంటర్‌లోనే పరీక్షా కేంద్రం నిర్వహించాలని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యాకేంద్రం విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

స్టడీ సెంటర్‌లోనే పరీక్షా కేంద్రం నిర్వహించాలి
పరీక్షా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

భువనగిరిటౌన, అక్టోబరు 26:  స్టడీ సెంటర్‌లోనే పరీక్షా కేంద్రం నిర్వహించాలని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యాకేంద్రం విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 2019 బ్యాచ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు మంగళవారం భువనగిరిలో ప్రారంభం కాగా, హాజరైన విద్యార్థులు పరీ క్షా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సుమారు 20కి పైగా అధ్యయన కేంద్రాలు ఉన్నప్పటికీ కేవలం భువనగిరి, నల్లగొండలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పరీక్షలకోసం వారం రోజులపాటు సుదూర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు రావాల్సి వస్తుందన్నారు. స్టడీ సెంటర్లలో ఏర్పాటు చేసే సెల్ఫ్‌ సెంటర్లలోనే పరీక్షలు రాయవచ్చని ప్రవేశాలు స్వీకరించిన సమయంలో నిర్వాహకులు పేర్కొన్నారని, ఆ తర్వాత చేతులెత్తేశారని ఆరోపించారు. అయితే మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులకు నల్లగొండలో, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన విద్యార్థులకు భువనగిరిలో పరీక్షాకేంద్రాలను కేటాయించారు. అయితే దూరవిద్యలో చేరేవారిలో మహిళలు, ఉద్యోగులే అధికంగా ఉంటుండటంతో పరీక్షల కోసం సహాయకులు, పిల్లలతో కలిసి సుదూర ప్రాంతాలకు రావాల్సిన దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కేయూ యూనివర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హాల్‌టికెట్‌ జిరాక్స్‌ ప్రతులను దహనం చేశారు. అయితే పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగాయి. 


Updated Date - 2021-10-27T06:53:58+05:30 IST