విద్యుత్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-09T06:49:16+05:30 IST
విద్యుత్ చట్టసవరణ బిల్లు ఉపయోగించుకోవాలని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
జగిత్యాల అర్బన్, డిసెంబరు 8: విద్యుత్ చట్టసవరణ బిల్లు ఉపయోగించుకోవాలని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ప్రాంత రైతుల పాలిట గుదిబండగా మారబోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు అమలులోకి వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ బిల్లు వల్ల కేవలం రైతులకే కాకుండా, వినియోగదారులకు కూడా ఇబ్బందులు తప్పవన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అధికారాలను అన్నింటినీ కేంద్రం చేతులోకి తీసుకునే కుట్రలు చేస్తోందన్నారు. విద్యుత్ సంస్థ పాలిట అశనిపాతంగా మారిన ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యో గులు ఉద్యమాలు చేస్తున్నా, వ్యతిరేకిస్తున్న కేంద్రం మొండిగా వ్యవహరించడం దారుణం అన్నారు. ఈ విద్యుత్ సవరణ చట్టం బిల్లు వల్ల ఎవరికి ఉపయో గమో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్రం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వ్యవసాయ చట్టాల రద్దు మాదిరిగానే, విద్యుత్ సవరణ చట్టం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఈఈ 1104 యూనియన్ నాయకులు చేరాలు రమ ణ, మధు, గంగాధర్, 327 యూనియన్ నాయకులు రాంజీ నాయక్, రాజమల్లు, భద్రోద్దీన్, ప్రకాశ్, పవర్ డిప్లమా యూనియన్ నాయకులు జవహర్ నాయక్, ఇంజీనీర్స్ అసోసియేషన్ నాయకులు అశోక్, విద్యుత్ శాఖ జిల్లా సూపరిండెంట్ ఇంజనీయర్ వేణు మాధవ్, డీఈ హరికృష్ణ పాల్గొన్నారు.