దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2021-12-04T07:02:27+05:30 IST

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఎస్పీ

జిల్లా అంతటా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించి వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారికి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. 

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 3 : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్‌జీవోస్‌ భవన్‌లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించు టకు ముందుకు సాగాలని అన్నారు. ప్రతీవ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని, దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నతస్థాయిలో జీవించుటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకాదని, పట్టుదలతో కృషిచేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ప్రభుత్వం పరంగా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమఅభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగులతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పై క్రమంగా సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్‌ ద్వారా దివ్యాంగుల సమస్యలన్నీ పరిష్కరించుటకు కృషి చేస్తా మని అన్నారు. కొంతమంది దివ్యాంగుల కొత్తపెన్షన్‌ మంజూరుకు ప్రభుత్వా నికి పంపామని, త్వరలో మంజూరవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, సీడీపీవో, వికలాంగుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T07:02:27+05:30 IST