హిమసీమలో అభయ తార!

ABN , First Publish Date - 2021-07-16T05:30:00+05:30 IST

అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక నిలయం తారాదేవి ఆలయం. సిమ్లాకు సమీపంలోని షోగీలో... శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయప్రదాయినిగా...

హిమసీమలో అభయ తార!

అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక నిలయం తారాదేవి ఆలయం. సిమ్లాకు సమీపంలోని షోగీలో... శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయప్రదాయినిగా భక్తులు కొలుస్తారు. 

ఆలయ చరిత్ర ప్రకారం, పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్‌ వంశానికి చెందిన ఒక రాజు వేటకు వెళ్ళాడు. చీకటి పడడంతో పరివారానికి దూరమై, దట్టమైన అడవిలో దారి తప్పిపోయాడు. తిరిగి తిరిగి అలసటతో ఒక చోట విశ్రమించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా తన  కుటుంబం పూజించే తారా దేవి ప్రతిమను వెంట తీసుకుపోయేవాడు. ఆ రాత్రి కలలో తారాదేవి, క్షేత్ర పాలకులైన హనుమంతుడు, భైరవుడు ఆ రాజు కలలో కనిపించారు. అజ్ఞాతంగా ఉన్న తమకు గుడి కట్టి, పూజలు చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలని ఆదేశించారు. మెలకువ వచ్చిన రాజుకు తిరిగి తన పరివారాన్ని కలుసుకొనే మార్గం కనిపించింది.   అమ్మవారు తనకు కలలో దర్శనమిచ్చిన చోట ఆ రాజు ఆలయాన్ని నిర్మించి, దారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అదే వంశానికి చెందిన రాజా బల్బీర్‌ సింగ్‌ కలలో... 1825లో తారాదేవి కనిపించి, తారావ్‌ పర్వత శిఖరం మీద తనను ప్రతిష్ఠించాల్సిందిగా ఆజ్ఞాపించింది. ఆ మేరకు అష్టధాతు విగ్రహాన్ని ఆ కొండపై అతను ఏర్పాటు చేశాడు. కాగా, తారాదేవి ఆలయం సుమారు రెండువందల యాభై ఏళ్ళ నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. పశ్చిమబెంగాల్‌ ప్రాంతానికి చెందిన తారాదేవి విగ్రహం హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువై పూజలందుకుంటోందనే కథ కూడా ఉంది.

సముద్రమట్టానికి  1851 మీటర్ల ఎత్తయిన కొండ శిఖరంపైౖ ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతి, మహాకాళి, భగవతి, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ఇటీవలే పునర్నిర్మాణం జరుపుకొన్న ఆలయ నిర్మాణంలో ప్రధానంగా కలపనే వినియోగించారు. ఆ ఆలయంలో దేవీ నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతాయి. నవరాత్రుల్లో అష్టమి రోజున సేన్‌ రాజవంశీకులు ఈ ఆలయాన్ని సందర్శించి, తారా దేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. చుట్టూ చెట్లతో నిండిన లోయలతో... ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతున్న ఈ ప్రాంతం పర్యాటకంగానూ పేరుపొందింది. 


Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST