ప్రతి ఇంటి వివరాలు సేకరించాలి

ABN , First Publish Date - 2020-07-08T11:09:38+05:30 IST

వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటి వివరాలు సేకరించి నమోదు చేయాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరి బాబు సూచించారు. వెంకటాచలం మండలం

ప్రతి ఇంటి వివరాలు సేకరించాలి

వలంటీర్లకు కలెక్టర్‌ శేషగిరి బాబు సూచన


వెంకటాచలం, జూలై 7 : వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటి వివరాలు సేకరించి నమోదు చేయాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరి బాబు సూచించారు. వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామ సచివాలయాన్ని ఆయన మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమీక్షించారు. ప్రతి వలంటీరు తనకు కేటాయించిన గ్రామంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వాటిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అనే సమాచారాన్ని కూడా సేకరించాలన్నారు.


అలాగే ఇళ్లలో విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను రికార్డు చేయాలన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించే బాధ్యత వలంటీర్లదేనన్నారు. గ్రామాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు  ఉన్నట్లు గుర్తిస్తే సచివాలయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  భవిష్యత్తులో డీఆర్‌డీఏ ద్వారా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని,  అందులో వలంటీర్ల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వలంటీర్లకు మార్గనిర్దేశకం చేయాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. తొలుత గొలగమూడిలో కలెక్టర్‌ పర్యటించారు.


ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయో అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ శీనా నాయక్‌, జడ్పీ సీఈవో పీ సుశీల, డీపీవో ధనలక్ష్మి, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ఏ సరళ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:09:38+05:30 IST