ముగ్గురు విద్యార్థినులను మింగేసిన సోకిలేరు

ABN , First Publish Date - 2022-09-27T07:02:58+05:30 IST

విజ్ఞాన విహారయాత్ర విషాదంగా మారింది. ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్థినులను వాగు మింగేసింది. కళ్లముందే తమ స్నేహితురాలు వాగులో కొట్టుకుపోతుండగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు

ముగ్గురు విద్యార్థినులను మింగేసిన సోకిలేరు

కాలుజారి వాగులో పడిన ఓ విద్యార్థిని

రక్షించే క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయిన స్నేహితులు

మృతులు బాపట్ల జిల్లా వేటపాలెం బాలికలు


మోతుగూడెం, సెప్టెంబరు 26: విజ్ఞాన విహారయాత్ర విషాదంగా మారింది. ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్థినులను వాగు మింగేసింది. కళ్లముందే తమ స్నేహితురాలు వాగులో కొట్టుకుపోతుండగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు విద్యార్థినులు వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చదలవాడ పంచాయతీ పరిధిలోని సోకిలేరు వాగులో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన శ్రీ అనుజ్ఞ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్ర నిమిత్తం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి బయలుదేరారు. భద్రాచలం మీదుగా మినీ వ్యాన్‌లో వచ్చిన వారు మార్గమధ్యంలో చింతూరు మండలంలోని సోకిలేరు వాగు సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ కొద్దిసేపు ఫొటోలు దిగారు. అయితే కాళ్లు కడుక్కునేందుకు గౌరవి సువర్ణ కమల(15) అనే విద్యార్థిని ముందుగా వాగులోకి దిగి కాలుజారి పడిపోయింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోతుండగా చేయి అందించి ఆమెను రక్షించేందుకు సూరిన గీతాంజలి(14), గుమ్మడి జయశ్రీ(15) ప్రయత్నించారు.


అయితే ప్రవాహ వేగానికి వారు కూడా కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా సువర్ణ కమల, జయశ్రీని స్థానికులు ఒడ్డుకు చేర్చి మోతుగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు గంటల గాలింపు తర్వాత మూడో బాలిక గీతాంజలి మృతదేహం లభించింది.

Updated Date - 2022-09-27T07:02:58+05:30 IST