అన్నదమ్ములను కాటేసిన మృత్యుపాశం
ABN , First Publish Date - 2022-06-25T08:50:04+05:30 IST
తండ్రికి నాలుగు రోజులుగా సుస్తీ చేస్తే.. ఆయనకు బదులుగా ఆ అన్నదమ్ములిద్దరూ పొలంలో ఉన్న గేదెకు పాలు తీయడానికి నాలుగు రోజులుగా వెళ్తున్నారు.
- విద్యుదాఘాతంతో బైక్ సహా ఇద్దరూ సజీవ దహనం
- తండ్రికి బదులు పొలం పనులకు వెళ్లగా ఉపద్రవం
- మృతులు బీటెక్, ఇంటర్ విద్యార్థులు..
- ఏలూరు జిల్లాలో పెను విషాదం
జంగారెడ్డిగూడెం, జూన్ 24 : తండ్రికి నాలుగు రోజులుగా సుస్తీ చేస్తే.. ఆయనకు బదులుగా ఆ అన్నదమ్ములిద్దరూ పొలంలో ఉన్న గేదెకు పాలు తీయడానికి నాలుగు రోజులుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్పై పొలానికి వెళ్తుండగా.. హైటెన్షన్ విద్యుత్ వైరు వారి పాలిట మృత్యుపాశమైంది. విద్యుదాఘాతంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దేవులపల్లికి చెందిన వల్లేపల్లి దుర్గారావు, రాధ దంపతులకు నాగేంద్ర(21), ఫణీం ద్ర(18) ఇద్దరు కుమారులు. వీరిలో నాగేంద్ర బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా డు. ఫణీంద్ర ఇంటర్మీడియేట్ పూర్తి చేశాడు. తండ్రి దుర్గారావుకు నాలుగు రోజులు గా నీరసంగా ఉండటంతో పొలంలో ఉన్న గేదెల పాలను అన్నదమ్ములే తీస్తున్నా రు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుంచి ద్విచక్రవాహనంపై పొ లం బల్దేరారు. మార్గం మధ్యలో 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడి పుంత రోడ్డుపై వేలాడుతోంది. దగ్గరకు వెళ్లాక గమనించి వాహనాన్ని అదుపు చేసేందుకు బ్రేక్ వేసినప్పటికీ వాహనం ఆగకుండా నేరుగా వైరు వద్దకు వెళ్లడంతో వైరు వీరిని తాకింది. వెంటనే షాక్ గురైన ఇద్దరు అక్కడక్కడే పడిపోయారు. అన్నదమ్ములిద్దరూ దగ్ధమవుతున్న ఆ ద్విచక్రవాహనంపైనే నిర్జీవులుగా పడి ఉన్నారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.