జీవితాలతో ఆటలు

ABN , First Publish Date - 2020-06-25T11:26:01+05:30 IST

వారంతా చిరుద్యోగులు.. చాలీ చాలని వేతనాలైనా సర్దుకుపోతున్నారు. అలాంటి ఉద్యోగుల జీతాల్లో కూడా కొందరు కోత పెట్టేశారు.

జీవితాలతో ఆటలు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఆర్టీసీ

లాక్‌డౌన్‌ సమయంలో పనిచేయలేదని కోత పెట్టిన ఏజెన్సీ


(కడప-ఆంధ్రజ్యోతి): వారంతా చిరుద్యోగులు.. చాలీ చాలని వేతనాలైనా సర్దుకుపోతున్నారు. అలాంటి ఉద్యోగుల జీతాల్లో కూడా కొందరు కోత పెట్టేశారు. ఇదెక్కడో కాదు.. కడప ఆర్టీసీ డిపో పరిధిలో చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయి వేతనాలు ఇచ్చినా లాక్‌డౌన్‌లో పనులు చేయలేదంటూ ఏజెన్సీ నిర్వాహకులు ఆ ఉద్యోగులకు కొంత మాత్రమే ఇవ్వడంపై విమర్శలు రేగుతున్నాయి. కడప ఆర్టీసీ డిపోలో బస్సుల క్లీనింగ్‌, ఏసీ బస్సుల్లో అటెండర్లు దాదాపు 40 మంది ఓ ఏజెన్సీ ద్వారా పని చేస్తున్నారు. ప్రతి నెలా ఆర్టీసీ ఆ ఏజెన్సీ నిర్వాహకులకు డబ్బు చెల్లిస్తే, నిర్వాహకులు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు సుమారు రూ.9 వేలదాకా ఉంటుంది.


లాక్‌డౌన్‌ సాకుతో.. 

కరోనాను నివారించేందుకు మార్చి 22న మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విధించారు. 23 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. బస్సులు తిరగకున్నా కూడా మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను ఏజెన్సీకి చెల్లించారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం మార్చి నెలలో 10 రోజులు, ఏప్రిల్‌ నెల మొత్తం లాక్‌డౌన్‌ కారణంగా పనిచేయలేదంటూ పూర్తి జీతం ఇవ్వకుండా రూ.2వేలు ఉద్యోగుల చేతిలో పెట్టినట్లు సమాచారం.


ఆర్టీసీ పూర్తి జీతాలు ఇచ్చింది కదా.. అని కొందరు ఉద్యోగులు ఏజెన్సీని అడిగితే.. మీరు పనిచేయలేదు, ఇచ్చింది తీసుకోండంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో కొన్ని పరిశ్రమలు, వ్యాపా ర సంస్థలు మూతపడినప్పటికీ వాటిల్లో పనిచేసే సిబ్బందికి మానవతా దృక్పథంతో యా జమాన్యాలు వేతనాలు చెల్లిస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు పూర్తి వేత నం ఇచ్చినా ఏజెన్సీ ని ర్వాహకులు తమ జీతాల్లో కోత వేయడం పట్ల అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని ఆర్టీసీలోని విజిలెన్స్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.


జీతాలు చెల్లించాం..

జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాలు ఏజెన్సీ నిర్వాహకుల ఖాతాల్లో జమ చేశాం. ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుంటే.. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

- జితేంద్రనాధరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం

Updated Date - 2020-06-25T11:26:01+05:30 IST