మౌలిక వసతుల కల్పనకే ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలి
ABN , First Publish Date - 2021-03-08T05:06:11+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకే 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు.
డీపీవో దశరథరామిరెడ్డి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 7: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకే 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా రూ. 102.24 కోట్లు జిల్లాకు అందగా వాటిని పంచాయతీల ఖాతాలకు జమ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు 18537 చేతి పంపుల మరమ్మతుల కోసం రూ.1.85 కోట్లు, ట్యాంకుల మరమ్మతుల కోసం రూ.1.74 కోట్లు జిల్లా పరిషత్కు విడుదల చేశామన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిధుల నుంచి 40 శాతం విద్యుత్ బకాయిల చెల్లింపులు చేయాలని స్పెషలాఫీసర్లను ఆదేశించినట్లు వివరించారు. మిగిలిన నిధులతో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం, వీధి దీపాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పారు. పంచాయతీ బడ్జెట్లో పదిశాతం నిధులను సిబ్బంది జీతాల చెల్లింపులకు, కంప్యూటర్ల కొనుగోలు చేయవచ్చన్నారు. గత వారం 15వ ఆర్థిక సంఘం నిధులు తొలివిడతగా రూ. 40.58 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ నిధుల నుంచి 40 శాతం విద్యుత్ బకాయిలు చెల్లింపులు, తాగునీటి పనులు, గ్రామీణ రహదారులు, పశు సంవర్థక, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలకు, వీధి దీపాల నిర్వహణకు, పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు.