ఆవు ఒక్కటే.. ఆక్సిజన్‌ పీల్చి వదిలేది

ABN , First Publish Date - 2021-09-04T08:06:53+05:30 IST

ప్రపంచంలో ఆక్సిజన్‌ పీల్చి... ఆక్సిజన్‌ను మాత్రమే వదిలేసే జీవి ఈ భూమ్మీద ఆవు ఒక్కటేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారంటూ ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది.

ఆవు ఒక్కటే.. ఆక్సిజన్‌ పీల్చి వదిలేది

చర్చనీయాంశమైన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

అలహాబాద్‌, సెప్టెంబరు 3: ప్రపంచంలో ఆక్సిజన్‌ పీల్చి... ఆక్సిజన్‌ను మాత్రమే వదిలేసే జీవి ఈ భూమ్మీద ఆవు ఒక్కటేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారంటూ ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది. గోవును అపహరించి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ వాసి జావేద్‌ అనే వ్యక్తి, బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకోగా దాన్ని తిరస్కరిస్తూ జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోసంరక్షణ ఆవశ్యకతను చెబుతూ ఉచ్వాస, నిశ్వాసల పరంగా ఆవుకు ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ బెయిల్‌ నిరాకరణ ఉత్తర్వుల్లో ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఇదే మాట అన్నారు. గోవులకు దగ్గరగా ఉంటే క్షయ వ్యాధి నుంచి కోలుకోవచ్చునని చెబుతూ ఆవు నిశ్వాసలోనూ ఆక్సిజనే ఉంటుందని రావత్‌ చెప్పారు. ఊపిరి పరంగా ఆవుకు ఈ ప్రత్యేకత ఉందని కొందరు నమ్ముతారు. మరి.. వాస్తవం ఏమిటి? మిగతా జీవాలకు మల్లే ఆవు, నిశ్వాసలో కార్బన్‌డైయాక్సైడ్‌ వదలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి గత అధ్యయనాలనే సమాధానంగా పరిగణించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాణుల మాదిరిగానే ఆవు కూడా ఆక్సిజన్‌ శ్వాసించి, కార్బన్‌ డైయాక్సైడ్‌ను వదులుతుంది అనేది శాస్త్రవేత్తల మాట. అయితే గోవు నిశ్వాసలో కొంత ఆక్సిజన్‌ ఉంటుంది. అలా అని ఇది ఆవుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతగా చూడనక్కర్లేదు. ఎందుకంటే అన్ని ప్రాణుల నిశ్వాసల్లోనూ కొంతమేర ఆక్సిజన్‌ ఉంటుంది. ఉచ్వాసలో ఆక్సిజన్‌ 21 శాతం మేర ఉంటే నిశ్వాసలో కార్బన్‌డై యాక్సైడ్‌ 16శాతం ఉంటుంది. పీల్చేగాలిలో 0.04శాతం కార్బన్‌డైయాక్సైడ్‌ ఉంటే, నిశ్వాసలో 4శాతం మేర ఆక్సిజన్‌ కూడా ఉంటుంది! 


ఆవు గురించి జడ్జి మాటలు ఇవి! 

జడ్జి  శేఖర్‌ కుమార్‌ యాదవ్‌, గోరక్షణ పరంగా పురాణాల్లో, చరిత్రలో ఉన్న ప్రాధాన్యాన్ని  12 పేజీల ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘హిందూయిజం ప్రకారం 33 కోట్ల దేవుళ్లు, దేవతలు, ఆవులోనే నివసిస్తారు. శ్రీకృష్ణుడు ఆవు పాదాల నుంచే జ్ఞానాన్ని పొందాడు.  మనిషికి గోవు ఓ నేస్తమని గౌతమ బుద్ధుడు ఉద్బోధించాడు. ‘‘నన్ను చంపండి గానీ.. గోవును చంపకండి’’ అని స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్‌ అన్నారు. మొఘల్‌ చక్రవర్తులైన బాబర్‌, హుమాయున్‌, అక్బర్‌ తమ రాజ్యంలో గోవులను వధించొద్దని చెబుతుండేవారు. ముస్లిం నేతల్లో ఎక్కువమంది గోవధపై నిషేధం విధించాలనే డిమాండ్‌కు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారు’ అని జడ్జి శేఖర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-04T08:06:53+05:30 IST