అప్పులు, మద్యం ప్రాణాలు తీశాయి!

ABN , First Publish Date - 2021-08-02T08:43:16+05:30 IST

ఓ పక్క వ్యవసాయంలో అప్పులు, మరో పక్క మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు ఆత్మహత్యకు యత్నించగా... భార్య బతకదనే భయంతో భర్త పురుగు...

అప్పులు, మద్యం ప్రాణాలు తీశాయి!

కాపు నేస్తం డబ్బులు కూడా తాగుడుకే

మనస్తాపంతో ఎలుకల మందు తిన్న భార్య

ఆమె బతకదని పురుగుమందు తాగిన భర్త

గంటల వ్యవధిలో దంపతుల మృతి


పంగులూరు, ఆగస్టు 1 : ఓ పక్క వ్యవసాయంలో అప్పులు, మరో పక్క మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు ఆత్మహత్యకు యత్నించగా... భార్య బతకదనే భయంతో భర్త పురుగు మందుతాగి తనువుచాలించాడు. ఆయన చనిపోయిన గంటకే  ఆమె కూడా మృతిచెందింది.  ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు... చందలూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి ఆంజనేయులు (61), ఫణీంద్ర (55) భార్యా భర్తలు.  భూములు కౌలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యవసాయంలో నష్టాలు రావడం, రూ.7 లక్షల వరకు అప్పు అవడంతో ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఫణీంద్రకు కాపు నేస్తం కింద డబ్బులు వచ్చాయి.


వాటిని కూడా ఆంజనేయులు మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గత నెల 23న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించగా రావినూతలలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. శనివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన భార్య ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో భర్త ఆంజనేయులు భయంతో పురుగు మందు తాగాడు.  చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా శనివారం రాత్రి మృతి చెందాడు. భార్య ఆదివారం మధ్యాహ్నం తనువు చాలించింది. . ఆదివారం  కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.   

               


Updated Date - 2021-08-02T08:43:16+05:30 IST