కులాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది
ABN , First Publish Date - 2020-08-02T08:53:12+05:30 IST
కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హితవు పలికారు.
- టీఆర్ఎస్ వెంటే దళితులు
- తట్టుకోలేక ప్రతిపక్షాల ఆరోపణలు: బాల్క సుమన్
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హితవు పలికారు. ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, అది తట్టుకోలేక ప్రభుత్వం మీద విపక్షాల నేతలు దుష్పచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ఘటనలను తమ పార్టీకి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరు, కారం చేడు ఘటనలు ఎవరి హయాంలో జరిగాయో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తున్నామని సుమన్ ఎద్దేవా చేశారు.