తీరంలో పతంగుల కోలాహలం
ABN , First Publish Date - 2021-01-16T04:43:41+05:30 IST
పండుగ కోలాహలమంతా తీరంలోనే సాక్షాత్కరించింది. సంక్రాంతి, కనుమ సందర్భంగా గురు, శుక్రవారాల్లో ఆర్కే బీచ్ జనంతో కిక్కిరిసిపోయింది.
సందడిగా మారిన బీచ్ రోడ్డు
పండుగను ఆనందంగా జరుపుకున్న నగరవాసులు
బీచ్ రోడ్డు జనవరి 15: పండుగ కోలాహలమంతా తీరంలోనే సాక్షాత్కరించింది. సంక్రాంతి, కనుమ సందర్భంగా గురు, శుక్రవారాల్లో ఆర్కే బీచ్ జనంతో కిక్కిరిసిపోయింది. కనుమ సందర్భంగా పతంగులను ఎగురవేసేందుకు నగర వాసులు పెద్దఎత్తున తీరానికి చేరుకున్నారు. దీంతో వైఎంసీఏ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రద్దీ ఏర్పడింది. నింగిలో రంగురంగులు, వివిధ ఆకారాల్లోని గాలిపటాలు రివ్వున దూసుకుపోయాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా పతంగుల పండుగలో పాల్గొన్నారు. మరికొంతమంది కుటుంబాలతో సహా బీచ్రోడ్డుకు చేరుకుని, ఆకాశంలో ఎగురుతున్న పతంగులను వీక్షించి, సందడిగా గడిపారు. ద్విచక్రవాహనాలు, కార్లు రోడ్డు పక్కన నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా బీచ్లో సుమారు 60 మంది లైఫ్గార్డులు పహారా కాశారు.