వారి గాధ విని కంటతడి పెట్టిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-06-23T16:34:40+05:30 IST
అసభ్యంగా ప్రవర్తించేవారు. ఎదిరిస్తే కొట్టేవారు. ఎవరికైనా చెప్పారని తెలిసినా బాదేసేవారు. ఆ చర్యలు వికృతంగా ఉండేవి. భోజనం కూడా పెట్టేవారు కాదు..’
అసభ్యంగా ప్రవర్తించేవారు.. అడిగితే కొట్టేవారు..!
కలెక్టర్ ముందు బోరుమన్న అన్నమ్మ దివ్యాంగ పాఠశాల విద్యార్థులు
కంటతడి పెట్టిన కలెక్టర్ దిల్లీరావు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కలెక్టరేట్): ‘అసభ్యంగా ప్రవర్తించేవారు. ఎదిరిస్తే కొట్టేవారు. ఎవరికైనా చెప్పారని తెలిసినా బాదేసేవారు. ఆ చర్యలు వికృతంగా ఉండేవి. భోజనం కూడా పెట్టేవారు కాదు..’ అని కలెక్టర్ దిల్లీరావుకు ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగ పాఠశాల దివ్యాంగులు మొర పెట్టుకున్నారు. గుణదల విజయమేరీ బ్లైండ్ స్కూల్లో పునరావాసం పొందుతున్న దివ్యాంగ విద్యార్థులతో బుధవారం కలెక్టర్ దిల్లీరావు మాట్లాడారు. వారికి అందిస్తున్న సౌకర్యాలు, భద్రత, తదితరాల అంశాల గురించి పాఠశాల యాజమాన్యంతో చర్చించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, యాజమాన్యం, పునరావాసం పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అన్నమ్మ దివ్యాంగ పాఠశాలలో జరిగిన అరాచకాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన మాటలు విని కలెక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు.
నిందితులను శిక్షిస్తాం.. : కలెక్టర్
కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, పోలీస్, శిశు సంక్షేమ, చైల్డ్లైన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు.