వైద్యుల్లో ఆందోళన
ABN , First Publish Date - 2020-04-10T11:02:37+05:30 IST
జిల్లా సర్వజనాస్పత్రి వైద్యుల్లోనూ కరోనాపై ఆందోళన ప్రారంభమైంది. కరోనా బాధితులకు చికిత్స అందించిన పలువురు
కరోనా పాజిటివ్ కేసులతో గుబులు
క్వారంటైన్లకు పలువురు వైద్యులు, సిబ్బంది
రక్షణ పరికరాలు లేకుండా వైద్యం చేయలేమన్న జూడాలు
డాక్టర్ల రక్షణకే తొలి ప్రాధాన్యం అని కలెక్టర్ హామీ
సద్దుమణిగిన జూడాల వివాదం
అనంతపురం వైద్యం, ఏప్రిల్ 9 : జిల్లా సర్వజనాస్పత్రి వైద్యుల్లోనూ కరోనాపై ఆందోళన ప్రారంభమైంది. కరోనా బాధితులకు చికిత్స అందించిన పలువురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కరోనా వైద్యసేవలలో పాల్గొన్న పలువురు వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్లు హోం క్వారంటైన్లకు వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడింది.
దీంతో కరోనా ఓపీ, ఐసొలేషన్, క్వారంటైన్లో పనిచేయడానికి సిబ్బంది లేక కష్టాలు మొదలయ్యాయి. ఈ సమయంలో గురువారం జూనియర్ వైద్యులు(హౌస్ సర్జన్లు) కరోనా భయంతో విధులు నిర్వర్తించడానికి మొండికేశారు. రక్ష ణ లేకపోతే ఎలా వైద్య సేవలు అందించాలంటూ ప్రశ్నించారు. సూప రింటెండెంట్ రామస్వామినాయక్, ఆర్ఎంఓలు జూనియర్లకు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. కనీసం పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ లు, గ్లౌజ్లు, శానిటైజర్స్ ఇవ్వకపోతే ఎలా అని ఆస్పత్రి అధికారులను జూనియర్ డాక్టర్లు నిలదీశారు.
వీటిని కరోనా ఐసొలేషన్లో పనిచేసే వారికి మాత్రమే ఇస్తున్నారు. కానీ ఆస్పత్రిలో ప్రతి విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లకు ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా చికిత్సలు అందించే వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రక్షణ కవచాలు అందించా లన్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ గంధం చంద్రుడు హుటాహుటిన సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. జూనియర్ వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కరోనా నేప థ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణకు తొలి ప్రాధా న్యత ఇస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అందరికీ పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్లు అందిస్తామన్నారు. వైద్యుల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసి అన్ని సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మీకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా అండగా ఉం టుందని ఇలాంటి సమయంలో అందరూ సమష్టిగా పనిచేయాలని కోరారు. అనస్తీషియా టెక్నీషియన్లు, ఈఎన్టీ డాక్టర్లు, చెస్ట్ ఫిజీషియన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో జూనియర్ వైద్యులు శాంతించారు. ఇలా ఆస్పత్రిలో వైద్యుల వివాదం సద్దుమణిగింది.