వసూళ్ల పర్వం
ABN , First Publish Date - 2021-10-27T06:58:28+05:30 IST
అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కూరగాయల మార్కెట్ వేలానికి ముందే వసూళ్లకు తెరలేపాడు.
మార్కెట్లో షాపు కావాలంటే
పైసలు కొట్టాల్సిందే..
హిందూపురంలో వసూళ్లకు
తెగబడిన అధికార పార్టీ నాయకుడు
హిందూపురం టౌన, అక్టోబరు 26: అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కూరగాయల మార్కెట్ వేలానికి ముందే వసూళ్లకు తెరలేపాడు. పట్టణంలోని కూరగాయల మార్కెట్కు సంబంధించి 40మందికిపైగా పాత వ్యాపారులు న్నారు. గదులు దక్కాలంటే ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లించుకోవాల్సిందేనంటూ హుకుం జారీచేశారు. పాత కూరగాయల మార్కెట్ స్థానంలో కొత్త మార్కెట్ నిర్మించేందుకు తెలుగుదేశం హయాంలో పాత మార్కెట్ కూల్చివేశారు. దాని స్థానంలో నూతన మార్కెట్ను సుమారు రూ.20కోట్లు వెచ్చిం చి, నిర్మించారు. ఇందులో వాణిజ్య సముదాయాలకు వేలం పాటలు పూర్తయ్యాయి. కూరగాయల వ్యాపారానికి సంబంధించి పాత వ్యాపారులకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఇతరులెవరూ వేలంపాటలో పాల్గొనరాదని పలుమార్లు వేలంపాటను వాయిదా వేయించారు. ఒక్కో గదికి రూ.5లక్షలు సాల్వెన్స డిపాజిట్ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో రూ.5 లక్షలున్న సాల్వెన్సని రూ.2లక్షలకు తగ్గించామనీ, పాత వ్యాపారులకు గదులు దక్కేలా ఏర్పాట్లు చేశామని దీంతో రూ.2లక్షలు డిపాజిట్తోపాటు అదనంగా మరో రూ.50వేలు చెల్లించాలంటూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి వసూళ్లు ప్రా రంభించాడు. డబ్బు ఇవ్వకపోతే గది దక్కదంటూ హెచ్చరించడం గమనార్హం. ఈ విషయాన్ని కొందరు వ్యాపారులు.. మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రూ.20లక్షలకుపైగా వసూలు చేసి, మొత్తం మునిసిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులతోపాటు మరికొంతమందికి ఇవ్వాల్సి ఉంటుందని వ్యాపారులకు చెప్పినట్లు సమాచారం. దీనిపై మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్రావును వివరణ కోరగా.. అదనంగా రూ.50వేలు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందనీ, రూ.2లక్షల కంటే రూపాయి కూడా అదనంగా ఇవ్వకూడదంటూ పేర్కొన్నారు. బహిరంగ వేలం వేస్తామనీ, వ్యాపారులు పాల్గొనవచ్చన్నారు. ఎవరైనా డబ్బు ఇచ్చి ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామన్నారు.