సీఎం రానవసరం లేదు

ABN , First Publish Date - 2020-11-28T07:39:18+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్‌ కు అనుమతి రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా

సీఎం రానవసరం లేదు

ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్‌కు దక్కని అనుమతి..

సంప్రదాయం ప్రకారం సమాచారమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఐదుగురికే అవకాశం.. సీఎస్‌ సహా అందరూ అధికారులే!

గతంలో ఎన్నడూ ఇలా జరగలేదంటున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్‌ కు అనుమతి రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై సమీక్షకు మోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే! ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాన మంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్లినపుడు విమానాశ్రయం వద్ద్ద గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈసారీ అలాగే చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు సమాచారం ఇచ్చిందని వివరించారు.


కానీ, సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చిందని వివరించారు. వీరిలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామొహంతి, సైబరాబాద్‌ సీపీ వీసీ సీజ్జనార్‌, హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండెంట్‌  ఉన్నారు.

కాగా, ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు ఆహ్వానానికి సీఎం రానవసరంలేదనే ఆదేశాలు గతంలో ఎన్నడూ రాలేదని, పీఎంవో అధికారులు ఇప్పుడు ఎందుకిలా చేశారో అర్థంకావటం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 


Updated Date - 2020-11-28T07:39:18+05:30 IST